ఈ కారణాలతో హైదరాబాద్, వరంగల్ వాసులకు దూరమవుతున్న నిద్ర.. ఎన్ని గంటలు?

ట్రాఫిక్ తిప్పలు, పెరిగిన వేడి కారణంగా హైదరాబాద్, వరంగల్ వాసులకు నిద్ర దూరమవుతోందని అధ్యయనం చెబుతోంది. ఎన్ని గంటలు నిద్ర దూరం అవుతుందో ఇక్కడ చూడండి.

Published on: Aug 22, 2026, 17:20:41 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

హైదరాబాద్ వాసుల నిద్రపై నగరంలోని ట్రాఫిక్ ఇబ్బందులు, రాత్రివేళల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి. రద్దీ వేళల్లో నగర రోడ్లపై ఏర్పడుతున్న ట్రాఫిక్ జామ్‌లు, పర్యావరణంలో వస్తున్న మార్పుల వల్ల ప్రజలు ఏటా సుమారు 198 గంటల నిద్రను కోల్పోతున్నారని టమ్‌టమ్‌ ట్రాఫిక్ ఇండెక్స్, అమెరికాకు చెందిన క్లైమేట్ సెంట్రల్ అధ్యయనాలు వెల్లడించాయి. వ్యక్తిగత ఒత్తిళ్లు, మానసిక సమస్యలే కాకుండా మారుతున్న పట్టణ జీవనశైలి కూడా ప్రజల ఆరోగ్యకరమైన నిద్రకు భంగం కలిగిస్తోందని ఈ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ఉదయం, సాయంత్రం రద్దీ సమయాల్లో రోడ్లపై గంటల తరబడి చిక్కుకుపోవడం వల్ల వాహనదారులు మానసిక ఒత్తిడికి గురవ్వడమే కాకుండా, సమయానికి ఇంటికి చేరలేకపోతున్నారు. దీనివల్ల ఏటా ఒక్కో హైదరాబాద్ నివాసి సగటున 123 గంటల నిద్రను కోల్పోతున్నారు. అంటే దాదాపు 5 పూర్తి రోజుల సమయం కేవలం ట్రాఫిక్‌లోనే వృథా అవుతోంది.

ఉదయంతో పోలిస్తే సాయంత్రం వేళల్లోనే రద్దీ తీవ్రంగా ఉంటోంది. సాధారణ సమయాల్లో 10 కిలోమీటర్ల ప్రయాణానికి 32.37 నిమిషాలుడి పడితే, సాయంత్రం రద్దీ వేళల్లో అది 38.5 నిమిషాలకు పెరుగుతోంది. నగరంలో వాహనాల సంఖ్య 80 లక్షలు దాటడం, ప్రజా రవాణా వినియోగం తగ్గడమే దీనికి ప్రధాన కారణం. సాధారణంగా గంటకు 25-30 కి.మీ ఉండాల్సిన సగటు వేగం, సాయంత్రం వేళల్లో కేవలం 10 కి.మీలకు పడిపోతోంది.

కష్టపడి ఇంటికి చేరినా, రాత్రివేళల్లో పెరిగిన ఉష్ణోగ్రతల వల్ల ప్రశాంతంగా నిద్రపోలేకపోతున్నారు జనాలు. క్లైమేట్ సెంట్రల్ నివేదిక ప్రకారం వేడి రాత్రుల కారణంగా హైదరాబాదీలు ఏటా 75 గంటల నిద్ర కోల్పోతున్నారు. కాంక్రీట్ భవనాలు, తార్ రోడ్లు పగటిపూట వేడిని పీల్చుకుని, రాత్రి వేళల్లో నెమ్మదిగా విడుదల చేయడం వల్ల ఉష్ణోగ్రతలు త్వరగా తగ్గడం లేదు.

ఇక వరంగల్‌లో ట్రాఫిక్ రద్దీ వల్ల 82 గంటలు నిద్ర కోల్పోతే.. పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల కూడా 82 గంటల నిద్ర కోల్పోతున్నారు.

విశేషమేమిటంటే, తెలంగాణలోని వరంగల్‌లో ఉష్ణోగ్రతల ప్రభావం హైదరాబాద్ కంటే ఎక్కువగా ఉండి, అక్కడి ప్రజలు ఏటా 82 గంటల నిద్రను కోల్పోతున్నారు. నగరాల్లో తగినంత ఆకుపచ్చదనం లేకపోవడం, రవాణా వ్యవస్థ సరిగా లేకపోవడం ప్రజల ఆరోగ్యానికి పెద్ద సవాలుగా మారుతోంది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More