రాష్ట్రంలో చలి తీవ్రత కొనసాగుతోంది. దీంతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. చలి గాలుల తీవ్రతకు జనజీవనం అల్లాడిపోతున్నారు. ఉదయం, రాత్రి సమయాలాల్లో చలి తీవ్రత మరీ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయి సింగిల్ డిజిట్కే పరిమితవుతున్న పరిస్థితులున్నాయి.
ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు…

హైదరాబాద్ వాతావరణ కేంద్రం రిపోర్ట్ ప్రకారం… ఇవాళ ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో చలి గాలులు వీచే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
ఐఎండీ అంచనాల ప్రకారం…. ఆగ్నేయ, తూర్పు దిశల నుంచి ప్రబలంగా ఉన్న తక్కువ స్థాయి గాలులు రాష్ట్రవ్యాప్తంగా శీతలగాలుల పరిస్థితులకు దోహదం చేస్తున్నాయి. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో పొడి వాతావరణ పరిస్థితులు ఉండే సూచనలున్నాయి.
హైదరాబాద్ సిటీలో కూడా చలి తీవ్రత ఊహించని స్థాయిలో ఉంటోంది. పలు చోట్ల ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కు పడిపోతున్నాయి. హెచ్ సీయూ, గచ్చిబౌలి, మౌలాలి వంటి ప్రాంతాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంటోంది.
ఐఎండీ శాస్త్రవేత్త ధర్మరాజు మాట్లాడుతూ… ముఖ్యంగా తెలంగాణలోని ఉత్తర తెలంగాణ జిల్లాల్లో శీతలగాలులు వీస్తున్నాయని చెప్పారు. హైదరాబాద్ నగర శివార్లల్లో కూడా శీతలగాలులు వీస్తున్నాయని పేర్కొన్నారు. ఉ్మమడి ఆదిలాబాద్ జిల్లాలో అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వివరించారు.
చలి తగ్గే ఛాన్స్…!
మరోవైపు రాష్ట్రంలో రానున్న మూడు రోజులపాటు ఒకట్రెండు ప్రాంతాలు మినహా మిగిలిన చోట్ల చలి తీవ్రత తగ్గే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. గడిచిన 3 వారాలుగా ఉన్న పరిస్థితులతో పోల్చితే… క్రమంగా చలి తీవ్రత తగ్గుతోందని పేర్కొంది. ఇక సంక్రాంతి తర్వాత… వాతావరణంలో మరిన్ని మార్పులుంటాయి.