Telangana Weather Update : తెలంగాణకు ఐఎండీ అలర్ట్ - ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన
Telangana Weather Updates : తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. కొన్ని జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
Telangana Weather Updates : తెలంగాణకు వాతావరణశాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. మరికొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలతో పాటు కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడొచ్చని అంచనా వేసింది.

వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం…. దక్షిణ గంగా తీర పశ్చిమ బెంగాల్ మరియు దానికి ఆనుకుని ఉన్న బంగ్లాదేశ్ ప్రాంతాలపై నిన్నటి ఉపరితల ఆవర్తనం ఈరోజు కూడా కొనసాగుతోంది. ఇది సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉండి, ఎత్తుకు వెళ్లేకొద్దీ దక్షిణం వైపునకు వంగి ఉంది. ఈ ఉపరితల ఆవర్తనం ప్రభావం వల్ల రాబోయే 24 గంటల సమయంలో గంగా తీర పశ్చిమ బెంగాల్ ప్రాంతాలు, దానికి ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతం పరిసరాల్లో ఒక అల్పపీడనం రూపుదిద్దుకునే అవకాశం ఉంది.
ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన…
తాజా వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో…. ఇవాళ్టి నుంచి ఆగస్టు 8వ తేదీ ఉదయం 8:30 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే… ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఇక ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. గంటకు 30-40 కిమీ వేగంతో బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉంది.
- ఆగస్టు 8వ తేదీ ఉదయం నుంచి ఆగస్టు 9వ తేదీ ఉదయం వరకు రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడతాయి. గంటకు 30-40 కిమీ వేగంతో బలమైన ఉపరితల గాలులు వీస్తాయి.
- ఆగస్టు 9 నుంచి 12వ తేదీ వరకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి.
హైదరాబాద్ సిటీ వెదర్ రిపోర్ట్…
హైదరాబాద్ నగరం, పరిసర ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉంది. గంటకు 6 నుండి 8 కిలోమీటర్ల వేగంతో వాయువ్య దిశ నుండి గాలులు వీస్తాయి. గత 24 గంటల్లో నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రత 29.6 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 23.4 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

