ఏపీ , తెలంగాణలో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. ఉదయం, రాత్రి సమయంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోతున్నాయి. రోజురోజుకూ పరిస్థితి మరింత చల్లగా మారుతోంది. దీంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.

మరోవైపు రాబోయే మూడు రోజుల్లో తెలంగాణలో చలి మరింత పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. సాధారణం కంటే కనిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు తక్కువగా నమోదవుతాయని అంచనా వేసింది.ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది.
ఇవాళ ఆదిలాబాద్లో 9.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా… మెదక్లో 11.3 డిగ్రీలు, హనుమకొండలో 13.5 డిగ్రీలు, రామగుండంలో 14.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
మరోవైపు ఏపీలోనూ చలి తీవ్రత ఎక్కువగా ఉంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఇవాళ చింతపల్లిలో 9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా… మరోవైపు దట్టమైన పొగమంచు కురుస్తోంది. మన్యం జిల్లాలోనూ ఇదే మాదిరి పరిస్థితులు ఉండటంతో… గిరిజన ప్రజలు గజగజ వణికిపోతున్నారు.
మొన్నటి వరకు కూడా దిత్వా తుఫాన్ తాకిడి ప్రభావంతో కొన్నిచోట్ల వర్షాలు పడ్డాయి. తుఫాన్ ప్రభావం పూర్తి అయిన తర్వాత…. ఏపీ, తెలంగాణలో ఒక్కసారిగా చలి తీవ్రత పెరిగిది. దీనికి తోడు తీవ్రమైన మంచు అధికమైంది.