Indiramma Indlu GHMC : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పరిధిలో నిరుపేదల సొంతింటి కల నెరవేర్చేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ముగిసింది. నగరంలోని మొత్తం 16 శాసనసభ నియోజకవర్గాల పరిధి నుంచి ఏకంగా 60,014 దరఖాస్తులు అధికారులకు అందాయి.

సొంతిల్లు లేని అర్హులైన పేదలకు పారదర్శకమైన విధానంలో ఇళ్లను అందిస్తామని తెలంగాణ హౌసింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ పి.వి. గౌతమ్ స్పష్టం చేశారు. ఈ నెల 20వ తేదీ తర్వాత కంప్యూటరైజ్డ్ పద్ధతిలో డ్రా (లాటరీ) నిర్వహించి అర్హులకు ఇళ్లను కేటాయించనున్నట్లు ఆయన వెల్లడించారు.
క్షేత్రస్థాయి పరిశీలన వేగవంతం….
వచ్చిన వేలాది దరఖాస్తులను అధికారులు ప్రస్తుతం క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలిస్తున్నారు. దరఖాస్తుదారులు అందించిన సమాచారం సరైనదేనా, వారు ఇందిరమ్మ ఇళ్ల పథకానికి అర్హులేనా అనే అంశాలపై అధికారులు నేరుగా ఇళ్లకు వెళ్లి విచారణ జరుపుతున్నారు. అర్హులైన వారి జాబితాను సిద్ధం చేసిన తర్వాత, ఎవరికీ ఎలాంటి అనుమానాలు కలగకుండా పూర్తి పారదర్శకతతో కంప్యూటరైజ్డ్ లాటరీ విధానం ద్వారా ఇళ్ల కేటాయింపు ప్రక్రియను పూర్తి చేయనున్నారు.
మొత్తంగా ఈ ఆగస్టు నెలాఖరు నాటికి అర్హులైన పేదలందరికీ ఇళ్లను కేటాయించాలనే స్పష్టమైన గడువును హౌసింగ్ బోర్డు నిర్దేశించింది. దీంతో త్వరలోనే నగరంలోని వేలాది మంది పేదలకు సొంతింటి కల నిజం కానుంది.