క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభం.. జులై 21 నుంచి దరఖాస్తులు!
హైదరాబాద్ క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పథకం విధివిధానాలు, అర్హతలు, దరఖాస్తుల ప్రక్రియపై వివరాలను విడుదల చేశారు.
హైదరాబాద్ మహానగర పరిధిలో నివసించే అల్పాదాయ వర్గాల సొంతింటి కలను నిజం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. రాజధాని అవుటర్ రింగ్ రోడ్డు వరకు ఉన్న కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (CURE - క్యూర్) పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకానికి మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్బాబు, అజారుద్దీన్తో కలిసి సచివాలయంలో శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా పథకం విధివిధానాలు, దరఖాస్తు ప్రక్రియతో కూడిన బ్రోచర్ను వారు ఆవిష్కరించారు.

జీహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజిగిరి ప్రాంతాలలో సొంత ఇల్లు, స్థలం లేని పేదల కోసం ప్రభుత్వం మొత్తం లక్ష ఫ్లాట్లను నిర్మించనుంది. మొదటి విడత కింద క్యూర్ పరిధిలోని 16 అసెంబ్లీ నియోజకవర్గాలను ఎంపిక చేశారు. ఒక్కో నియోజకవర్గానికి దాదాపు 500 ఇళ్ల చొప్పున పనులు ప్రారంభించనున్నారు.
ప్రభుత్వ భూముల్లో హౌసింగ్ బోర్డ్ ఆధ్వర్యంలో ఈ బహుళ అంతస్తుల టవర్లను నిర్మిస్తారు. లబ్ధిదారులకు ఉచితంగా స్థలంతో పాటు రూ. 5 లక్షల ఆర్థిక సబ్సిడీని ప్రభుత్వం అందిస్తుంది. మిగిలిన వ్యయంలో లబ్ధిదారుని వాటాగా సుమారు రూ. 6 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని హౌసింగ్ బోర్డు స్పష్టం చేసింది.
ఈ పథకం కింద ఎల్ఐజీ (LIG) ఫ్లాట్ల కోసం దరఖాస్తు రుసుముగా రూ. 100, ఈఎండీ (EMD) డిపాజిట్గా రూ. 10,000 చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ డ్రాలో ఫ్లాట్ రాని వారికి ప్రభుత్వం ఈఎండీ మొత్తాన్ని (రూ. 10,000) తిరిగి ఖాతాల్లో జమ చేస్తుంది. జులై 21 నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు ఈ ఫ్లాట్ల కోసం అర్హులైన అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించవచ్చు. చదరపు గజం ధర రూ. 2 లక్షల నుంచి రూ. 3 లక్షలు ఉన్న అత్యంత ఖరీదైన ప్రాంతాలలో కూడా నిరుపేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వడం ఇందిరమ్మ రాజ్యంలోనే సాధ్యమైందని ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.
దరఖాస్తుదారు కనీసం 10 సంవత్సరాలుగా హైదరాబాద్ నివాసి అయి ఉండాలి. దరఖాస్తుదారు/కుటుంబానికి ఓఆర్ఆర్/క్యూర్ ప్రాంతంలో ఇల్లు, ఫ్లాట్, ప్లాట్ ఉండకూడదు. ఒక కుటుంబం-ఒక దరఖాస్తు-ఒక ఫ్లాట్ ప్రతిపాదికన అప్లికేషన్ తీసుకుంటారు.అంతేకాదు దరఖాస్తుదారు ఇంతకు ముందు ఇలాంటి గృహ ప్రయోజనాన్ని పొంది ఉండకూడదు. తప్పుడు ప్రకటన, వాస్తవాలను దాచిపెట్టడం వంటివి తిరస్కరణకు/రద్దుకు దారితీయవచ్చు. దరఖాస్తు చేస్తున్న నియోజకవర్గం/యూనిట్ నివాసి అయి ఉండాలి.
మీసేవ ద్వారా దరఖాస్తులు సమర్పించాలి. డిమాండ్ నోటిఫికేషన్ ప్రకారం.. వార్షిక కుటుంబ ఆదాయం రూ.6లక్షల వరకు ఉండాలి. దరఖాస్తు చేసే సమయంలో కుల, జీతభత్యాల లేదా సర్వీస్ ధృవీకరణ పత్రాలను అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. వీటిని లాటరీ సమయంలో సమర్పించవచ్చు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్సైట్స్ లాంచ్ టీమ్లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


