కరీంనగర్ టౌన్ లో విషాద ఘటన చోటు చేసుకుంది. టూ టౌన్ ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న చంద్రశేఖర్ అత్తగారింట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. నాలుగు రోజులక్రితం ఆయన భార్య దివ్య పురుగుల మందు తాగి సూసైడ్ చేసుకుంది. ఆమె దశదిన కర్మల కోసం అత్తగారింటికి వెళ్లిన చంద్రశేఖర్… ఈ దారుణానికి ఒడిగట్టాడు.
ఇటీవలనే భార్య సూసైడ్…!

గత నాలుగు రోజుల క్రితం చంద్రశేఖర్ భార్య దివ్య… గన్నేరు పప్పు తిని ఆత్మహత్య చేసుకుంది. ఆ తర్వాత దివ్య మృతదేహాన్ని స్వగ్రామం ఇల్లందకుంట మండలం సీతంపేటకు తరలించారు. సీతంపేట గ్రామంలో దివ్య ఆత్మహత్యకు భర్త చంద్రశేఖర్ కారణమని ఆరోపించారు. ఓ దశలో దాడికి ప్రయత్నించినట్లు తెలిసింది. గ్రామస్తులు, బంధువుల నిరసనల మధ్య అంత్యక్రియలు పూర్తి చేశారు.
ఇవాళ ఐదు రోజుల కార్యక్రమానికి అత్తగారింటికి వచ్చిన చంద్రశేఖర్…. ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గదిలో నుంచి బయటికి రాకపోవడంతో అనుమానంతో చూడగా ఉరి వేసుకొని ఉండడంతో జమ్మికుంటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. తల్లిదండ్రుల మరణాలతో వారి ఇద్దరు చిన్నారులు అనాథలుగా మారారు.
ఒత్తిడితోనేనా…?
భార్య మృతి చెందటతో చంద్రశేఖర్ మానసిక కుంగుబాటుకు లోనైనట్లు తెలుస్తోంది. దీనికితోడు భార్య మృతికి భర్తే కారణమని బంధువులు ఆరోపించడంతో తీవ్ర ఒత్తిడికి లోనై ప్రాణాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.