తెలంగాణలో కొత్త పెన్షన్లకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అప్లికేషన్ చేయడానికి దరఖాస్తు ప్రక్రియకు చివరి తేదీ లేదని మెుదట ప్రచారం జరిగింది. కానీ తాజాగా ప్రభుత్వం దరఖాస్తుకు డెడ్లైన్ విధించింది. ఇతర విషయాల్లో ఎలాంటి మార్పు లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. తొలి విడతలో భాగంగా కింది కేటగిరీలకు చెంది అర్హత ఉన్న లబ్ధిదారులకు కొత్త పెన్షన్లను మంజూరు చేయనున్నారు.

ఒంటరి మహిళలు, వితంతు, దివ్యాంగులు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, ఫైలేరియా (బోదకాలు) బాధితులు, తలసేమియా, సికిల్ సెల్ డిసీజ్, హిమోఫిలియా వంటి రక్త సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న బాధితులకు పెన్షన్ రానుంది..
కొత్త పెన్షన్ల మంజూరుకు సంబంధించిన అర్హత నిబంధనల్లో ప్రభుత్వం ఎలాంటి మార్పులు చేయలేదు. గతంలో ఉన్న నిబంధనలనే అనుసరిస్తోంది. 2014 నుండి 2018 మధ్య కాలంలో విడుదల చేసిన ప్రభుత్వ ఉత్తర్వులలో పేర్కొన్న మార్గదర్శకాల ప్రాతిపదికన మాత్రమే లబ్ధిదారుల అర్హతలను నిర్ధారిస్తారు.
ప్రజా పాలన కార్యక్రమాలు, 99 రోజుల ప్రగతి ప్రణాళిక గ్రామసభలు, ప్రజావాణిలో ఇప్పటికే దరఖాస్తు చేసుకుని, అవసరమైన అన్ని పత్రాలను సమర్పించిన వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. గతంలో కాగితాలు సమర్పించని వారు, అలాగే ఇంతవరకు దరఖాస్తు చేసుకోని అర్హులైన పౌరులు తాజాగా అప్లై చేసుకోవచ్చు.
అర్హతను సరి చూసేందుకు ఆయా శాఖల నుంచి అవసరమైన సర్టిఫికెట్లను పొందే బాధ్యతను జిల్లా కలెక్టర్లకు అప్పగించారు.
కావాల్సిన పత్రాలు
వితంతు మహిళలు : భర్త మరణ ధృవీకరణ పత్రం.
ఒంటరి మహిళలు: విడాకులు/విడిపోయినట్లు పత్రం లేదా స్థానిక విచారణ నివేదిక.
గీత కార్మికులు: అబ్కారీ (ఎక్సైజ్) శాఖ ధృవీకరణ.
{{/usCountry}}గీత కార్మికులు: అబ్కారీ (ఎక్సైజ్) శాఖ ధృవీకరణ.
{{/usCountry}}చేనేత కార్మికులు: చేనేత, జౌళి శాఖ సర్టిఫికెట్.
ఫైలేరియా బాధితులు: వైద్య ఆరోగ్య శాఖ జారీ చేసిన ధృవీకరణ పత్రం.
పరిశీలన, ఎంపిక ప్రక్రియ
వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత, సంబంధిత అధికారులు క్షేత్రస్థాయి విచారణ చేపడతారు. అర్హులైన వారి జాబితాను జిల్లా స్థాయికి పంపి, జిల్లా కలెక్టర్ ఆమోదంతో పెన్షన్ మంజూరు ప్రక్రియను పూర్తి చేస్తారు. దీనికి తోడు, అర్హులైన ప్రతి ఒంటరి మహిళ, వితంతు దరఖాస్తు చేసుకోవడంలో, సర్టిఫికెట్లు పొందడంలో సహాయం చేయాలని స్వయం సహాయక సంఘాల సమాఖ్యలకు బాధ్యతలు అప్పగించారు.
కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తులను ఆగస్టు 31, 2026 వరకు స్వీకరిస్తారు. దరఖాస్తు వివరాలను తక్షణమే చేయూత పోర్టల్లో నమోదు చేయనున్నారు. ఎలాంటి అక్రమాలకు తావులేకుండా నిబంధనలకు లోబడి పూర్తి పారదర్శకతతో ఈ ప్రక్రియను ముగించాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.