KNRUHS MBBS Allotment : రాష్ట్రంలో 2026-27 విద్యాసంవత్సరానికి సంబంధించి ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా సీట్ల తొలి విడత కేటాయింపు ఫలితాలు విడుదలయ్యాయి. ఈ మేరకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం గురువారం వివరాలను వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు నాన్-మైనారిటీ, మైనారిటీ మెడికల్ కాలేజీలలో కన్వీనర్ కోటా కింద మొత్తం 3,366 మంది విద్యార్థులకు ఈ తొలి విడత కౌన్సెలింగ్లో సీట్లు కేటాయించారు.

ఈ సారి కూడా నీట్ (NEET) టాప్ ర్యాంకర్లు అత్యధికంగా సికింద్రాబాద్లోని గాంధీ మెడికల్ కాలేజీ, హైదరాబాద్లోని ఉస్మానియా మెడికల్ కాలేజీలకే మొదటి ప్రాధాన్యత ఇచ్చారు. నీట్ ఆల్ ఇండియా 83వ ర్యాంకు సాధించిన కొంపెల్ల సాయి గాయత్రి తేజోఅరుణిమ సికింద్రాబాద్లోని గాంధీ మెడికల్ కాలేజీలో ఓపెన్ కేటగిరీ కింద ప్రవేశం పొంది తెలంగాణ టాపర్గా నిలిచారు.
సెప్టెంబర్ 8 లోపు రిపోర్టింగ్ తప్పనిసరి
కౌన్సెలింగ్లో సీట్లు పొందిన అభ్యర్థులంతా వెంటనే తమ అలాట్మెంట్ ఆర్డర్ను విశ్వవిద్యాలయ అధికారిక వెబ్సైట్ ( https://www.knruhs.telangana.gov.in/ ) నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని KNRUHS స్పష్టం చేసింది. సంబంధిత యూనివర్సిటీ, కళాశాల ట్యూషన్ ఫీజులను చెల్లించడంతో పాటు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో కేటాయించిన కళాశాల ప్రిన్సిపాల్ వద్ద సెప్టెంబర్ 8వ తేదీ సాయంత్రం 4:00 గంటలలోపు రిపోర్ట్ చేసి ప్రవేశ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని వర్సిటీ ఆదేశించింది. నిర్దేశిత గడువులోగా కళాశాలల్లో రిపోర్ట్ చేయని అభ్యర్థుల సీట్లు రద్దవుతాయి.