Hyderabad Land Rates : హైదరాబాద్ భూముల చరిత్రలో రికార్డు ధర - ఎకరం భూమి రూ.237 కోట్లు!

Hyderabad Land Rates : హైదరాబాద్ ఐటీ హబ్ రాయదుర్గంలో తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీజీఐఐసీ) నిర్వహించిన ఈ-వేలంలో రికార్డు ధర పలికింది. ఎకరం భూమి ఏకంగా రూ.237 కోట్లకు అమ్ముడైంది.

Published on: May 29, 2026, 10:05:09 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Raidurg Land Auction : హైదరాబాద్ మహానగర రియల్ ఎస్టేట్ రంగంలో సరికొత్త చరిత్ర నమోదైంది. నగరంలోని ఐటీ హబ్‌గా పేరొందిన రాయదుర్గం ప్రాంతంలో జరిగిన భూముల ఈ-వేలంలో ఊహించని రీతిలో భారీ ధర పలికింది. తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీజీఐఐసీ) ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ వేలంలో ఎకరం భూమి రికార్డు స్థాయిలో దాదాపు రూ.237 కోట్ల ధర పలికింది. ప్రభుత్వ నిర్ణయించిన కనీస మద్దతు ధర (రిజర్వ్ ప్రైస్) రూ.139 కోట్లతో పోలిస్తే ఇది ఏకంగా 70.5 శాతం ఎక్కువ కావడం విశేషం.

హైదరాబాద్ భూముల చరిత్రలో రికార్డు ధర - ఎకరం భూమి రూ.237 కోట్లు!
హైదరాబాద్ భూముల చరిత్రలో రికార్డు ధర - ఎకరం భూమి రూ.237 కోట్లు!

రాయదుర్గంలోని ప్రైమ్ లొకేషన్‌లో ఉన్న ప్లాట్ నంబర్ 1A, 1/F పరిధిలోని 6.29 ఎకరాల బహుళ ప్రయోజన (మల్టీ-యూజ్) భూమి కోసం టీజీఐఐసీ ఈ వేలం నిర్వహించింది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ రియల్ ఎస్టేట్ డెవలపర్లు, అగ్రశ్రేణి నిర్మాణ సంస్థలు ఈ వేలంలో పోటాపోటీగా పాల్గొన్నాయి. తీవ్రమైన పోటీ నడుమ సాగిన ఈ బిడ్డింగ్ ప్రక్రియ ద్వారా ప్రభుత్వానికి ఏకంగా రూ.1,490.73 కోట్ల భారీ ఆదాయం సమకూరింది.

గత రికార్డులు బద్దలు….

గతేడాది అంటే 2025లో టీజీఐఐసీ నిర్వహించిన వేలంలో ఎకరం భూమి గరిష్టంగా రూ.177 కోట్లు పలికింది. ఇప్పటివరకు అదే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో అత్యధిక ధరగా ఉండేది. అయితే తాజా వేలంలో ఆ రికార్డు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. గత రికార్డు ధర కంటే ఇప్పుడు 34 శాతం అదనపు ధర పలకడం గమనార్హం. ఈ అసాధారణ ధరతో హైదరాబాద్ ల్యాండ్ మార్కెట్‌లో సరికొత్త బెంచ్‌మార్క్ నమోదైంది. అంతేకాకుండా దేశంలోనే అత్యంత ఆకర్షణీయమైన పెట్టుబడి గమ్యస్థానంగా తెలంగాణ నిలిచిందని ఈ వేలం స్పష్టం చేస్తోంది.

ఈ ప్రతిష్టాత్మక వేలం ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించారు. ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎంఎస్‌టీసీ (MSTC) ఈ-వేలం ప్లాట్‌ఫారమ్ ద్వారా డిజిటల్ పద్ధతిలో బిడ్డింగ్ సాగింది. ఎక్కడా ఎలాంటి లోపాలకు తావులేకుండా, పూర్తి పారదర్శకమైన వాతావరణంలో ఈ ప్రక్రియ ముగిసింది. ఈ భారీ లావాదేవీకి ప్రముఖ అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ సేవల సంస్థ జేఎల్‌ఎల్ (JLL) బ్రాండ్ ఏకైక ట్రాన్సాక్షన్ అడ్వైజర్‌గా వ్యవహరించింది.

"రాయదుర్గం ఈ-వేలానికి వచ్చిన అద్భుతమైన స్పందన.. హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రంపై దేశీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారులకు, డెవలపర్లకు ఉన్న అచంచలమైన నమ్మకానికి నిదర్శనం," అని టీజీఐఐసీ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కే. శశాంక స్పష్టం చేశారు.

"ఒక బహుళ ప్రయోజన భూమికి ఎకరానికి రికార్డు స్థాయిలో రూ.237 కోట్ల ధర లభించడం రాష్ట్ర ఆర్థిక వృద్ధి ప్రయాణంలో ఒక మైలురాయి. తెలంగాణలోని పెట్టుబడి అనుకూల వాతావరణం ఎంత బలంగా ఉందో చెప్పడానికి ఇదే నిదర్శనం" అని ఆయన వివరించారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More