హైదరాబాద్ మల్కాజ్‌గిరిలో ట్రాఫిక్ పర్యవేక్షణకు, నేరగాళ్లను గుర్తించేందుకు డ్రోన్లు!

హైదరాబాద్ మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ నియంత్రణ కోసం సరికొత్త "డ్రోన్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)" టెక్నాలజీని ఉపయోగించబోతున్నారు. ఈ మేరకు పోలీసులు ప్రణాళికలు వేస్తున్నారు.

Published on: May 27, 2026, 14:36:29 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో సరికొత్త టెక్నాలజీ పోలీసింగ్ విధానం అందుబాటులోకి రానుంది. కేవలం పోలీసులు తిరుగుతూ పహారా కాయడమే కాకుండా.. డ్రోన్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI), అధునాతన కెమెరాల సహాయంతో శాంతిభద్రతలను పర్యవేక్షించేందుకు సరికొత్త ప్లాన్ సిద్ధమైంది. ఈ టెక్నాలజీతో డ్రోన్ ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న రోడ్లను గమనిస్తోంది. అక్కడ వాహనాల రద్దీ ఎంత ఉందో లైవ్ విజువల్స్‌ను కంట్రోల్ రూమ్‌కు పంపుతోంది. కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ క్షణాల్లో ట్రాఫిక్ జామ్‌లను గుర్తించడమే కాకుండా, రోడ్డుపై వెళ్లే అనుమానితుల ముఖాలను పాత నేరస్థుల రికార్డులతో సరిపోల్చి చూస్తోంది.

మల్కాజ్‌గిరిలో డ్రోన్లు
మల్కాజ్‌గిరిలో డ్రోన్లు

ఈ సరికొత్త విధానంపై మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనర్ బి.సుమతి మాట్లాడుతూ.. 'మల్కాజ్‌గిరి కమిషనరేట్ పరిధిలో జనాభా చాలా ఎక్కువ. ఇక్కడ పెద్ద పెద్ద నివాస ప్రాంతాలు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ జోన్, పారిశ్రామిక ప్రాంతాలు మరియు బిజీగా ఉండే ట్రాఫిక్ రోడ్లు ఉన్నాయి. ఇంతటి భారీ జనాభా ఉన్న ప్రాంతంలో పాత పద్ధతుల్లో కాకుండా, టెక్నాలజీని వాడితేనే మంచి ఫలితాలు వస్తాయి. మా దగ్గర ఇప్పటికే నేరస్థుల వివరాలు(డేటాబేస్) పూర్తిగా ఉన్నాయి. ఈ సమాచారాన్ని ఆధునిక టెక్నాలజీతో అనుసంధానం చేయడం ద్వారా తక్కువ సిబ్బందితోనే నేరాలను అదుపు చేయవచ్చు.' అని ఆమె స్పష్టం చేశారు.

ఈ స్మార్ట్ పోలీసింగ్ ఎలా పనిచేస్తుంది?

రాత్రి సమయాల్లో లేదా పోలీసులు తిరగని నిర్జన ప్రదేశాలలో 5 నుంచి 6 ఏఐ (AI) డ్రోన్లు నిరంతరం నిఘా ఉంచుతాయి. ఈ డ్రోన్లలో ఉండే ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ ద్వారా పాత నేరస్థులు ఎవరైనా తిరుగుతుంటే వెంటనే కనిపెట్టవచ్చు.

ట్రాఫిక్ ఎక్కువగా ఉండే సమయాల్లో వాహనాల రద్దీని ఈ డ్రోన్లు ముందుగానే గమనిస్తాయి. రోడ్లపై భారీగా జామ్ కాకముందే పోలీసులు అలర్ట్ అయి ట్రాఫిక్‌ను క్లియర్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది.

రాత్రి వేళల్లో అనుమతించిన సమయం కంటే ఎక్కువ సేపు తెరిచి ఉంచే దుకాణాలు, హోటళ్లపై డ్రోన్ల ద్వారా నిఘా పెడతారు. పోలీసులు నేరుగా వెళ్లకుండానే, డ్రోన్ ఫోటోల ఆధారంగా ఆటోమేటిక్‌గా ఆన్‌లైన్ చలాన్లు (e-petty cases) జనరేట్ అవుతాయి.

ఒక్కో డ్రోన్ దాదాపు ముగ్గురు లేదా నలుగురు పోలీసులు చేసే పెట్రోలింగ్ డ్యూటీతో సమానంగా పనిచేస్తుంది.

మేడారం జాతరలోనే ట్రయల్ రన్ సక్సెస్!

ఈ డ్రోన్ టెక్నాలజీని ములుగు జిల్లాలో జరిగిన మేడారం జాతరలో TG-QUEST పేరుతో మొదటిసారి పరీక్షించారు. అడవి ప్రాంతం, సరైన ఇంటర్నెట్ లేని చోట కూడా యాంటెన్నాల ద్వారా 15 కిలోమీటర్ల మేర తాత్కాలిక ఇంటర్నెట్ నెట్‌వర్క్ క్రియేట్ చేసి డ్రోన్లను నడిపారు. రోజుకు దాదాపు 2 లక్షల వాహనాల పార్కింగ్‌ను మేనేజ్ చేయడానికి, తప్పిపోయిన వారిని కనిపెట్టడానికి ఈ టెక్నాలజీ అప్పట్లో ఎంతగానో సహాయపడింది.

ఇంజినీరింగ్ చదివిన పోలీసులకు బాధ్యతలు

ఈ హైటెక్ ప్రాజెక్ట్ కోసం మల్కాజ్‌గిరి కమిషనరేట్ ఒక స్మార్ట్ ప్లాన్ వేసింది. 2020 నుంచి 2024 మధ్య కాలంలో పోలీస్ శాఖలో చేరిన కానిస్టేబుళ్లు, ఏఎస్‌ఐల విద్యార్హతలను పరిశీలించగా.. వారిలో 620 మంది ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు ఉన్నట్లు తేలింది. ఇప్పుడు ఈ ఐటీ/ఇంజినీరింగ్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న పోలీస్ సిబ్బందికి డ్రోన్లు నడపడం, సీసీటీవీ విజువల్స్ విశ్లేషించడం, డేటా మేనేజ్‌మెంట్ లాంటి సాంకేతిక అంశాలపై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. అలాగే డ్రోన్ల రిపేర్ల కోసం పోలీస్ శాఖలోనే ఒక సొంత ల్యాబ్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More