బంగారం కంటే రంగారెడ్డిలో భూముల ధరలే ఎక్కువ : సీఎం రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'ఫ్యూచర్ సిటీ' (Future City) ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఫ్యూచర్ సిటీ కేవలం తెలంగాణ కోసమే కాదు, యావత్ ప్రపంచం కోసం నిర్మిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.

Updated on: Jun 10, 2026, 20:27:34 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణంలో బుధవారం మరో చారిత్రాత్మక ముందడుగు పడింది. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్‌ఖాన్‌పేటలో ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ శాశ్వత కార్యాలయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. రూ. 19 కోట్ల వ్యయంతో కేవలం 150 రోజుల్లోనే ఈ అత్యాధునిక కమాండ్ సెంటర్‌ను పూర్తి చేయడం విశేషం.

సీఎం రేవంత్ రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ అభివృద్ధిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లేందుకు తమ ప్రభుత్వం ఎంతటి పట్టుదలతో ఉందో స్పష్టం చేశారు. ఈ సభలో ముఖ్యమంత్రి పలు కీలకమైన అంశాలను మరియు భవిష్యత్తు ప్రణాళికలను పంచుకున్నారు. 2034 నాటికి తెలంగాణను ట్రిలియన్ డాలర్ ఎకానమీగా మార్చడంలో ఈ ఫ్యూచర్ సిటీ అత్యంత కీలక పాత్ర పోషిస్తుందని ఆకాంక్షించారు.

రాబోయే 8 సంవత్సరాలలో న్యూయార్క్, టోక్యో, సింగపూర్ వంటి అంతర్జాతీయ నగరాలకు దీటుగా భారత్ ఫ్యూచర్ సిటీ రూపుదిద్దుకోనుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 2034 నాటికి ఈ ఫ్యూచర్ సిటీ ద్వారా తెలంగాణను ట్రిలియన్ డాలర్ ఎకానమీగా మార్చడమే లక్ష్యంగా పెట్టుకున్నామని సీఎం ప్రకటించారు. ఇది కేవలం తెలంగాణ కోసమే కాదు, యావత్ భారతదేశ ఆధునిక జీవన ప్రమాణాలకు ప్రతిరూపంగా నిలుస్తుందన్నారు.

భారత్ ఫ్యూచర్ సిటీకి అనుసంధానంగా బుల్లెట్ రైల్ నెట్‌వర్క్‌లు (బెంగళూరు-హైదరాబాద్, శంషాబాద్-పూణే, శంషాబాద్-అమరావతి-చెన్నై) రాబోతున్నాయని రేవంత్ రెడ్డి ప్రకరటించారు. దీనివల్ల రంగారెడ్డి జిల్లా రూపురేఖలు మారిపోతాయని తెలిపారు. 1500 ఎకరాల్లో డేటా సిటీ, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు ఇక్కడ కొలువుదీరనున్నాయని చెప్పారు.

హైదరాబాద్ నగరాన్ని విస్తరించడం వల్లనే ప్రపంచపటంలో ప్రత్యేకంగా నిలిచిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బంగారం ధర కంటే రంగరెడ్డిలో భూముల ధరలు ఎక్కువగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. నిజాంలు, కులీకుతుబ్‌షా హైదరాబాద్ నగరాన్ని విస్తరించారని గుర్తుచేశారు. హైదరాబాద్‌లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రోడ్లు జలమయం కావడంపై సీఎం తీవ్రంగా స్పందించారు.

'చెరువుల్లోకి వెళ్లాల్సిన నీరు రోడ్లపైకి వస్తోందంటే దానికి కారణం గత పాలకుల కబ్జాలే. అంబర్‌పేట బతుకమ్మకుంట లాంటి ప్రభుత్వ భూములను గత కేసీఆర్ ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులకు రాసిచ్చింది. అందుకే మేము 'హైడ్రా' ద్వారా అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నాం. లేక్ ఎకానమీని సృష్టించి, చెరువులను పునరుద్ధరిస్తాం.' అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

గతంలో హైటెక్ సిటీ, ఔటర్ రింగ్ రోడ్ (ORR), జీనోమ్ వ్యాలీ నిర్మాణాలను అడ్డుకోవాలని చూసినట్లే, ఇప్పుడు ఫ్యూచర్ సిటీని అడ్డుకునేందుకు కుట్రలు పన్నుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. నగరాన్ని విస్తరించకపోతే హైదరాబాద్‌కు 10 లక్షల మంది ఐటీ నిపుణులు వచ్చేవారా అని ప్రశ్నించారు.

బీఆర్‌ఎస్ పార్టీని ప్రజలు ఎప్పుడో తిరస్కరించారని, అది ఒక 'రద్దయిన నోటు' లాంటిదని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. ప్రతిపక్షాలు తమ తీరు మార్చుకోకపోతే రాబోయే రోజుల్లో కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కదని హెచ్చరించారు. ఫ్యూచర్ సిటీ కోసం భూములిచ్చిన రైతులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని, వారికి మేలైన పరిహారం అందిస్తామని సీఎం ఈ వేదికగా హామీ ఇచ్చారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More