టూరిస్టులకు తెలంగాణ టూరిజం గుడ్ న్యూస్ చెప్పేసింది. సోమశిల నుంచి శ్రీశైలానికి లాంచీ ప్రయాణం షురూ అయింది. ఇందులో భాగంగా శనివారం తెలంగాణ టూరిజం లాంచీని ప్రారంభించగా 65 మంది ప్రయాణికులు శ్రీశైలంకు ప్రయాణించారు. పర్యాటక శాఖ అధికారులు జెండా ఊపి లాంచీని ప్రారంభించారు.
వారానికి 3 సార్లు…
నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ తీరంలోని సోమశిల నుంచి శ్రీశైలానికి లాంచీ జర్నీ ఉంటుంది. వారానికి మూడు సార్లు ఈ ఆపరేషన్ ఉంటుంది. మంగళవారం, గురువారం, శనివారాల్లో ఉదయం 9 గంటలకు లాంచీ సోమశిల నుంచి ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు.
కృష్ణమ్మ ఒడిలో, నల్లమల పచ్చదనం అందాలను వీక్షిస్తూ కృష్ణా అలలపై జర్నీ కొనసాగుతుంది. ఈ అద్భుతమైన జర్నీ… కొన్ని రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుంది. వరద ఉద్ధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఆపరేట్ చేయరు. కృష్ణా నదిలో సాగే జర్నీ… మాటల్లో వర్ణించలేం.సుమారు 120 కిలోమీటర్ల జలవిహారం ఉంటుంది. 6 నుంచి 7 గంటల పాటు సమయం పడుతుంది.
టికెట్ ధరలు….
ఒకవైపు ప్రయాణానికి పెద్దలకు రూ.2 వేలు, పిల్లలకు రూ.1600 వసూలు చేస్తున్నారు. లాంచీలో పర్యాటకులకు ఉదయం మరియు సాయంత్రం టీ, స్నాక్స్ మరియు లంచ్ అందిస్తారు.
వన్ వే క్రూయిజ్ టూర్ ప్యాకేజీ ధరలతో పోల్చితే… రౌండప్ (రానుపోను) జర్నీకి ధరలు వేరుగా ఉంటాయి. ఈ వివరాలను కూడా తెలంగాణ టూరిజం వెబ్ సైట్ ( https://tgtdc.in/home ) లో చూడొచ్చు. లేదా స్థానికంగా ఉండే టూరిజం కార్యాలయంలో వివరాలను తెలుసుకోవచ్చు.