Hyderabad : అమీర్పేట్లో భారీ అగ్నిప్రమాదం - షాపింగ్ కాంప్లెక్స్, మెస్కు వ్యాపించిన మంటలు
Ameerpet fire accident Hyderabad : హైదరాబాద్ అమీర్పేట్ మెట్రో పిల్లర్ నంబర్ 1043 సమీపంలోని కేఎస్ఆర్ షాపింగ్ కాంప్లెక్స్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు పక్కనే ఉన్న హర్ష మెస్కు వ్యాపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
Ameerpet fire accident Hyderabad : హైదరాబాద్ నగరంలోని అత్యంత రద్దీగా ఉండే వ్యాపార కేంద్రమైన అమీర్పేట్లో గురువారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఇక్కడి మెట్రో పిల్లర్ నంబర్ 1043 సమీపంలో ఉన్న కేఎస్ఆర్ షాపింగ్ కాంప్లెక్స్ లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.

ప్రమాదం జరిగిన కొద్దిసేపటికే మంటలు తీవ్రరూపం దాల్చి… పక్కనే ఉన్న హర్ష మెస్కు కూడా వేగంగా వ్యాపించాయి. ప్రస్తుతం కాంప్లెక్స్, మెస్ నుంచి మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. ప్రమాద స్థలంలో దట్టమైన నల్లటి పొగ కమ్ముకోవడంతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు, వాహనదారులు తీవ్ర ఊపిరాడక ఇబ్బంది పడ్డారు.
అమీర్పేట్ ప్రధాన రహదారిపై ఈ ప్రమాదం జరగడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపు చేయడానికి సిబ్బంది తీవ్రంగా శ్రమించారు.
భారీగానే ఆస్తి నష్టం..!
షాపింగ్ కాంప్లెక్స్ , మెస్లో ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. దాదాపు 30కిపైగా షాపులు కాలిపోయినట్లు సమాచారం. అయితే ఈ భారీ అగ్నిప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ప్రమాదానికి గల కారణాలు, ఆస్తి నష్టానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదం కారణంగా అమీర్పేట్ మైత్రీవనం మార్గంలో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.
సహాయక చర్యల కారణంగా…. అమీర్పేట నుంచి ఎస్సార్ నగర్ మార్గంలో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది, దీనివల్ల ఈ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ అయ్యింది. వాహనదారులు ఈ మార్గంలో ప్రయాణించకుండా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని నగర సీపీ సజ్జనార్ ఓ ప్రకటన ద్వారా విజ్ఞప్తి చేశారు. విధుల్లో ఉన్న ట్రాఫిక్, అత్యవసర సిబ్బందికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
మెట్రో పిల్లర్ కు సెగ…!
అమీర్పేట్లో అగ్నిప్రమాదం జరిగిన బిల్డింగ్కు అడుగు దూరంలోనే మెట్రో పిల్లర్ ఉండగా… 1043 నంబర్ పిల్లర్కు అగ్ని సెగలు తాకాయి. మెట్రో పిల్లర్కు స్వల్పంగా క్రాక్ రావడంతో అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. పిల్లర్ నాణ్యతను చెక్ చేస్తున్నారు.ప్రత్యేక డివైజ్లతో పిల్లర్ సామర్థ్య పరీక్షలు నిర్వహిస్తుండగా… ప్రమాద తీవ్రత దృష్ట్యా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. నిపుణుల నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనున్నారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

