జాతర నాటికి 'మేడారం' అభివృద్ధి పనులు పూర్తి చేస్తాం - మంత్రి పొంగులేటి
జనవరిలో జరిగే సమ్మక్క సారలమ్మ జాతరకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని వరంగల్ జిల్లా ఇంఛార్జ్ మంత్రి పొంగులేటి తెలిపారు.శాశ్వత ప్రాతిపదికన నిర్మాణాలు చేస్తున్నామని… జాతర నాటికి అన్ని పనులు పూర్తి చేస్తామని పేర్కొన్నారు.
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సమ్మక్క- సారలమ్మ జాతర జనవరి నెలలో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో జాతర కోసం శాశ్వత ప్రాతిపదికన ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. జిల్లా ఇంఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు మంత్రి సీతక్క ఎప్పటికప్పుడు పనులు పర్యవేక్షిస్తున్నారు.
మేడారంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు
ఇవాళ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సీతక్కతో కలిసి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దేవాలయ గద్దెల పునరుద్ధరణ అభివృద్ధి పనులను పరిశీలించారు. దేవాలయ ప్రాంగణంలోని పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెల రాతి నిర్మాణాలను, ఆలయ ప్రాంగణ ఫ్లోరింగ్ పనులను, రాతి స్తంభాల స్థాపన నిర్మాణ పనులను,జంపన్న వాగు వద్ద జరుగుతున్న పనులపై ఆరా తీశారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ…. నిర్మాణ పనులలో నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ పనులల్లో వేగం పెంచి త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను, గుత్తేదారులను ఆదేశించారు. తొలుత సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద పూజలు చేశారు. ఆ తర్వాత మాట్లాడిన ఆయన… మరో వందేళ్ల వరకు భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా చూసే విధంగా నిర్మాణాలను పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
మేడారం దేవాలయం అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి పొంగులేటి ఆదేశించారు. ఈ జాతరకు గిరిజనులు, గిరిజనేతరులు దాదాపు కోటి మందికి పైగా హాజరవుతారని… జాతర కోసం 50 కిలోమీటర్ల పరిధిలో భక్తుల కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని మేడారం ప్రాంగణాన్ని మహా అద్భుతంగా తీర్చిదిద్దుతున్నామని వివరించారు.