Paddy Procurement : ధాన్యం కొనుగోలు వేగవంతం చేయండి - మిల్లర్లు, దళారులు మోసం చేస్తే కఠిన చర్యలు : మంత్రి ఉత్తమ్

Paddy Procurement in Telangana : వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈ నెల చివరికల్లా కొనుగోళ్లను పూర్తి చేయాలన్నారు.

Published on: May 25, 2026, 06:08:04 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Paddy Procurement in Telangana : రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం చేపట్టిన వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను యుద్ధప్రాతిపదికన మరింత వేగవంతం చేయాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆదివారం హైదరాబాద్ నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్రలతో కలిసి ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఖమ్మం జిల్లా నుంచి రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, వివిధ ప్రాంతాల నుండి రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, అడ్డూరి లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు మరియు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

రికార్డు స్థాయిలో కేంద్రాలు….

ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ సీజన్ లో రాష్ట్రవ్యాప్తంగా 141 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం సాగు జరిగిందని అంచనా వేశామన్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వం 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కనీస మద్దతు ధర (MSP) చెల్లించి కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 8,575 కొనుగోలు కేంద్రాలను (ఐకేపీ సెంటర్లు) ఏర్పాటు చేశామన్నారు.

ఇప్పటివరకు 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని విజయవంతంగా కొనుగోలు చేసి, రైతులకు రూ. 8,749 కోట్ల కనీస మద్దతు ధరను విడుదల చేసినట్లు వెల్లడించారు. క్షేత్రస్థాయిలో ఎక్కడా కొరత రాకుండా 21 కోట్ల గోనె సంచులను అందుబాటులో ఉంచామని, ప్రస్తుతం కొనుగోలు కేంద్రాల్లో వేచి ఉన్న మరో 8.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని వెంటనే సేకరించాలని ఆదేశించారు.

కఠిన చర్యలు ఉంటాయి - మంత్రి ఉత్తమ్

ఈ నెల చివరికల్లా ధాన్యం కొనుగోలు ప్రక్రియను పూర్తిగా ముగించాలని మంత్రి ఉత్తమ్ గడువు విధించారు. పొరుగు రాష్ట్రాల నుంచి వరి ధాన్యం, జొన్నలు, మొక్కజొన్నలు రాష్ట్రంలోకి రాకుండా సరిహద్దు జిల్లాల్లో చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద తాలు, తరుగు పేరుతో రైస్ మిల్లర్లు లేదా దళారులు ఎవరైనా రైతులను మోసం చేయాలని చూస్తే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను వెంటనే ట్యాబ్‌లలో నమోదు (Tab Entry) చేసి, రైతులకు నగదు చెల్లింపులు త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలన్నారు. వరి కొనుగోళ్లపై వచ్చే తప్పుడు మరియు ప్రతికూల వార్తలను అధికారులు వెంటనే ఖండించాలని, వాస్తవాలను మరియు రికార్డు స్థాయి కొనుగోళ్లను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. గత ప్రభుత్వాల కాలంలో రైతులు ధాన్యం అమ్ముకున్న తర్వాత పైసల కోసం నెలల తరబడి వేచి చూడాల్సి వచ్చేదని, కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొన్న వెంటనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తోందని స్పష్టం చేశారు. కొనుగోలు కేంద్రాల వద్ద హమాలీల కొరత లేకుండా చూసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. అలాగే, పట్టణాభివృద్ధి, వాయు కాలుష్య నివారణలో భాగంగా పొలాల్లో వ్యవసాయ వ్యర్థాలను (పరాటి) తగులబెట్టవద్దని, దీనిపై రైతుల్లో అవగాహన కల్పించాలని కోరారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More