తెలంగాణలోని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా పరిధిలో అత్యంత దారుణమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మైనర్ బాలికపై తొమ్మిది మంది వ్యక్తులు కలిసి సమూహ అత్యాచారానికి ఒడిగట్టారు.
3 రోజుల పాటు నిర్బంధం..!

పోలీసులు అందించిన ప్రాథమిక వివరాల ప్రకారం.. బాధితురాలికి తెలిసిన ఓ స్నేహితుడి సాయంతో నిందితులు ఈ కుట్రకు తెరలేపారు. ఆ స్నేహితుడి ద్వారానే బాలికను ఒక చోటు నుంచి మరోక చోటు తీసుకెళ్లిన నిందితులు…. దాదాపు మూడు రోజుల పాటు నిర్బంధంలో ఉంచారు. ఆ మూడు రోజులు ఆమెపై తీవ్ర స్థాయిలో లైంగిక దాడులకు, అఘాయిత్యానికి పాల్పడ్డారు.
బాధితురాలు ఈ దారుణం నుంచి బయటపడి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా అల్వాల్ పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు…. ఈ నేరంతో సంబంధం ఉన్న తొమ్మిది మంది నిందితులలో ఎనిమిది మందిని ఇప్పటికే అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు.
ఈ కేసులో ప్రమేయం ఉన్న మరొక నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, అతడి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు తీవ్రతరం చేశామని అధికారులు తెలిపారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ దారుణానికి సంబంధించిన పూర్తి వివరాలను రాబట్టేందుకు…. కేసును అన్ని కోణాల్లో లోతుగా విచారిస్తున్నామని పోలీస్ యంత్రాంగం పేర్కొంది. పోక్సోతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించింది. మరోవైపు పూర్తిస్థాయి విచారణ తర్వాతే పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.