తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహుర్తం ఫిక్స్ అయింది. ఈసారి కొత్తగా అజారుద్దీన్ కు మంత్రివర్గంలో చోటు దక్కనుంది. ఎల్లుండే ఆయన మంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని తెలుస్తోంది. ఈ మేరకు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

తెలంగాణ కేబినెట్ లో ప్రస్తుతం మూడు బెర్తులు ఖాళీగా ఉన్నాయి.అజారుద్దీన్ ప్రమాణస్వీకారం చేస్తే మరో రెండింటిని భర్తీ చేయాల్సి ఉంటుంది. ఇప్పటివరకు కేబినెట్ లో మైనారీవర్గాలకు చెందిన మంత్రి లేరు. విస్తరణలో తప్పకుండా మైనార్టీ కోటా నుంచి ఒకరికి ఛాన్స్ ఇవ్వాలనే అభిప్రాయాలు ఎప్పట్నుంచే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే…. అజారుదీన్ పేరు ఖరారైనట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం జరుగుతున్న జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కూడా ఆయన టికెట్ ఆశించారు. కానీ చివరికి నవీన్ యాదవ్ కు టికెట్ ఖరారైంది. అయితే ఆయనకు కేబినెట్ చోటు కల్పించటంపై హామీ ఇవ్వటంతో… వెనక్కి తగ్గారనే చర్చ కూడా వినిపించింది.
ఈ ఏడాది జూన్ లో జరిగిన కేబినెట్ విస్తరణలో భాగంగా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి కేబినెట్ లో బెర్త్ ఖరారైంది. ప్రస్తుతం వీరు మంత్రులుగా కొనసాగుతున్నారు. ఫలితంగా ఎస్సీ, బీసీ సామాజికవర్గాలకు చోటు దక్కినట్లు అయింది. ఎమ్మెల్యే వివేక్ ఎస్సీ మాల సామాజికవర్గానికి చెందిన వారు కాగా… లక్ష్మణ్ మాదిగ సామాజికవర్గానికి చెందిన వారుగా ఉన్నారు. ఇక ముదిరాజ్ సామాజికవర్గానికి చెందిన శ్రీహరికి బీసీల కోటాలో ఛాన్స్ దక్కినట్లు అయింది. తాజాగా అజారుద్దీన్ కు చోటు కల్పించాలని నిర్ణయించటంతో… మైనార్టీ వర్గానికి కూడా అవకాశం దక్కినట్లు అవుతోంది.
ప్రస్తుత కేబినెట్ లో ఉమ్మడి నిజామాబాద్ నుంచి ఎవరికీ అవకాశం దక్కలేదు. ఇక్కడ్నుంచి పార్టీ సీనియర్ నేత సుదర్శన్ రెడ్డి పేరు రేసులో ఉన్నారు.ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి పరిగి ఎమ్మెల్యేతో పాటు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి మంత్రి పదవి కోసం గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. వీరే కాకుండా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా చాలా రోజులుగా బెర్త్ ఆశిస్తున్నారు. ఆశావాహులు ఎక్కువగా ఉండటంతో ఎవరికి ఛాన్స్ ఇవ్వాలనే దానిపై పార్టీ అధినాయకత్వం లోతుగా కసరత్తు చేయాల్సి వస్తోంది. ఇప్పటికే పలుమార్లు పరిశీలించిన హైకమాండ్…. ప్రస్తుతానికి ఒకటి మాత్రం భర్తీ చేసి… మరో రెండింటిని త్వరలోనే భర్తీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.