...
...
Next Story

క్రికెటర్ నుంచి కేబినెట్ మినిస్టర్ వరకు…! అజారుద్దీన్‌ ప్రస్థానం

మాజీ క్రికెటర్‌ మహ్మద్‌ అజారుద్దీన్‌ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. శుక్రవారం మధ్యాహ్నం ఆయనతో గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ రాజ్‌భవన్‌లో ప్రమాణస్వీకారం చేయించారు. స్టార్ క్రికెటర్ పేరొందిన అజారుద్దీన్‌… కేబినెట్ మంత్రిగా కూడా అవకాశం దక్కించుకున్నారు.

Published on: Oct 31, 2025, 12:53:52 IST
Advertisement

మహ్మద్‌ అజహరుద్దీన్‌…. ఓ నాటి టీంఇండియా సూపర్ స్టార్ క్రికెటర్. తన మణికట్టు మాయాజాలంతో ప్రపంచ క్రికెట్ అభిమానులను మంత్రముగ్ధుల్ని చేశాడు. భారత జట్టుకు సారథ్యం కూడా వహించి…. అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకరిగా నిలిచారు.

మాజీ క్రికెటర్‌ మహ్మద్‌ అజహరుద్దీన్‌
మాజీ క్రికెటర్‌ మహ్మద్‌ అజహరుద్దీన్‌

అత్యుత్తమ వన్డే బ్యాట్స్‌మెన్‌లలో ఒకరిగా పేరొందిన ఆజారుద్దీన్…. 1985 క్రికెట్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకున్న భారత జట్టులో సభ్యుడిగా కూడా ఉన్నాడు. అలాంటి అజారుద్దీన్…. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చాడు. ఎంపీగా కూడా గెలిచిన ఆయన.. ప్రస్తుతం తెలంగాణ కేబినెట్ లో మంత్రిగా అవకాశం దక్కించుకున్నాడు.

కేబినెట్ విస్తరణలో భాగంగా శుక్రవారం (అక్టోబర్ 31) రాజ్ భవన్ లో ఆయన మంత్రిగా ప్రమాణస్వీకారం చేశాడు. ఓసారి ఎంపీగా కూడా గెలిచిన ఆయన… ఎమ్మెల్యేగా మాత్రం పోటీ చేసి ఓడిపోయాడు. తెలంగాణ ప్రభుత్వం ఆయన్ను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా సిఫార్సు చేయగా… గవర్నర్ ఆమోదించాల్సి ఉంది.

అజారుద్దీన్ ప్రస్థానం:

  • మహమ్మద్ అజారుద్దీన్ 1963, ఫిబ్రవరి 8వ తేదీన హైదరాబాద్ లో జన్మించారు.
  • ఆల్ సెయింట్స్ హైస్కూల్లో పాఠశాల విద్యను పూర్తి చేయగా… నిజాం కళాశాల నుంచి బి.కాంలో డిగ్రీ పూర్తి చేశారు.
  • మొట్టమొదటిసారిగా 1984 డిసెంబరు 31న టెస్ట్ మ్యాచ్ ఆడాడు. తన మొదటి ఇన్నింగ్స్ లోనే 110 పరుగులు చేశాడు. ఆ తర్వాత ఆడిన రెండు టెస్టు మ్యాచుల్లోనూ అజర్ రెండు శతకాలు సాధించి రికార్డు సృష్టించాడు.
  • 1985 వన్డే క్రికెట్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకున్న భారత జట్టులో సభ్యుడిగా ఉన్నాడు.
  • 1989 లో కృష్ణమాచారి శ్రీకాంత్ తర్వాత భారత క్రికెట్ జట్టు కెప్టెన్సీ బాధ్యతలను చేపట్టాడు. మొత్తం 47 టెస్ట్ మ్యాచులు, 174 వన్డే మ్యాచులకు కెప్టెన్ గా వ్యవహరించాడు.
  • అజారుద్దీన్ ప్రపంచంలోని అత్యుత్తమ వన్డే బ్యాట్స్‌మెన్‌లలో ఒకరిగా పేరొందారు. మణికట్టు ఆట శైలికి పేరు పొందాడు. తనదైన శైలిలో సిక్సర్లు, ఫోర్లు కొట్టగలిగే బ్యాట్స్ మెన్ గా పేరొందారు.
  • మ్యాచ్ ఫిక్స్ ఆరోపణల నేపథ్యంలో క్రికెట్ ఆడకుండా నిషేధం కూడా ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత నిషేధం ఎత్తివేసినప్పటికీ అప్పటికే వయసు భారంతో క్రికెట్ కు దూరమయ్యాడు.
  • క్రికెట్ కు దూరమైన అజారుద్దీన్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మొరాదాబాద్ నుండి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి కున్వర్ సర్వేష్ కుమార్ సింగ్‌పై 49,107 ఓట్ల మెజారిటీతో గెలిచారు.
  • 2014 లోక్‌సభ ఎన్నికలలో రాజస్థాన్‌లోని టోంక్ సవాయీ మాధోపుర్ నుండి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి సుఖ్‌బీర్ సింగ్ జౌనపురియా చేతిలో 1,35,506 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. 2019 లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేయలేదు.
  • తెలంగాణ కాంగ్రెస్ లో యాక్టివ్ గా పని చేసిన అజారుద్దీన్ కొంతకాలం పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ గా పని చేశారు.
  • 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపినాథ్ చేతిలో 16,337 ఓట్ల తేడాతో ఓడిపోయారు.
  • ఆజారుద్దీన్ ను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నియమించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది ఆగస్టులో సిఫార్సు చేసింది. ఇందుకు గవర్నర్ ఆమోదముద్ర వేయాల్సి ఉంది.
  • అక్టోబర్ 31, 2025వ తేదీన తెలంగాణ కేబినెట్ లో మంత్రిగా ఆజారుద్దీన్ ప్రమాణస్వీకారం చేశారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe