గత కొంతకాలంగా అవినీతి అధికారుల విషయంలో తెలంగాణ ఏసీబీ దూకుడుగా ముందుకెళ్తోంది. ఇటీవలే కాలంలో చాలా మంది అధికారులు పట్టుబడిన ఘటనలు వెలుగు చూశాయి. ఇందులోనూ మహిళా అధికారిణుల సంఖ్య కూడా ఎక్కవగా ఉంటోంది. తాజాగా వరంగల్ జిల్లాలో మత్స్యకార అధికారిణిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న అల్లు నాగమణి ఏసీబీకి దొరికిపోయారు. ఆమెతో పాటు ఔట్ సోర్సింగ్ ఉద్యోగిని కూడా అరెస్ట్ చేశారు.
రూ. 70 వేలు లంచం డిమాండ్…

మత్స్య పారిశ్రామిక సహకార సంఘంలోకి 84 మంది నూతన సభ్యులను చేర్చుకోవడానికి సంబంధిత సభ్యులు మత్స్యకార అధికారిణి అయిన నాగమణికి దరఖాస్తు పెట్టుకున్నారు. అయితే ఈ అప్లికేషన్ ను ప్రాసెస్ చేయడంతో పాటు పేర్లు నమోదు ఉత్తర్వులు జారీ చేయడానికి రూ. 70 వేలు లంచం డిమాండ్ చేసింది.
ఇదే విషయంపై ఫిర్యాదుదారుడు ఏసీబీని ఆశ్రయించాడు. ఈ క్రమంలోనే రూ. 70 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాడెండ్ గా పట్టుకున్నారు. వారి కార్యాలయంలో క్షేత్ర స్థాయి అధికారిగా (పొరుగు సేవలు) పని చేస్తున్న పెద్దబోయిన హరీష్ ని కూడా అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఏ ప్రభుత్వాధికారి అయినా లంచం అడిగితే ఫిర్యాదు చేయాలని ఏసీబీ అధికారులు సూచించారు. అవినీతి నిరోధక శాఖ "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయాలని తెలిపారు. అంతేకాకుండా వివిధ సామాజిక మాధ్యమాలైన "వాట్సాప్ ( 9440446106), ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) లేదా వెబ్ సైట్ ( https://acb.telangana.gov.in ) ద్వారా కూడా సంప్రదించవచ్చని పేర్కొన్నారు. ఫిర్యాదుదారుల సమాచారం గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు.