యాదాద్రి జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. రైలులో ప్రయాణిస్తున్న నవదంపతులు గొడవ పడి క్షణికావేశంలో సూసైడ్ చేసుకున్నారు. ముందు భార్య ట్రైన్ నుంచి దూకి చనిపోగా… భయంతో భర్త కూడా టైన్ నుంచి దూకి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన యాదగిరిగుట్ట మండలం వంగపల్లి రైల్వేస్టేషన్ వద్ద వెలుగు చూసింది.

వివరాల ప్రకారం… ఏపీలోని పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలం రావుపల్లికి చెందిన కోరాడ సింహాచలం(25)కు, అదే జిల్లాలోని అంకవరం గ్రామానికి చెందిన భవాని(19)తో రెండు నెలల క్రితం వివాహమైంది. భర్త సింహాచలం హైదరాబాద్లో ని ఓ కెమికల్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ప్రస్తుతం జగద్గిరిగుట్టలో నివాసం ఉంటున్నారు.
విజయవాడలోని బంధువుల ఇంటికి వెళ్లేందుకు వీరిద్దరూ…. మచిలీపట్నం ఎక్స్ప్రెస్ రైలులో సికింద్రాబాద్ నుంచి గురువారం రాత్రి బయలుదేరారు. ఈ మార్గంలో వీరిద్దరి మృతదేహాలు కనిపించాయి. ట్రాక్ మెన్ పోలీసులకు సమాచారం ఇవ్వటంతో విచారణ చేపట్టారు. ముందుగా ట్రైన్ నుంచి జారిపడి మృతి చెందారని భావించారు. కానీ వీరిద్దరూ ట్రైన్ లో గొడవపడిన ఓ వీడియో వెలుగులోకి వచ్చింది. దీంతో క్షణాకికావేశంలో భార్య భర్త సూసైడ్ చేసుకున్నట్లు గుర్తించారు.
ముందు భార్య..ఆపై భర్త..
మృతికి ముందు దంపతులు రైలులో గొడవ పడ్డారు. దీంతో భార్య భవానీ క్షణికావేశంలో ముందుగా రన్నింగ్ ట్రైన్ నుంచి దూకింది. ఆ వెంటనే భయంతో భర్త సింహాచలం కూడా ట్రైన్ నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.