ఉప్పల్ వేదికగా 'మెస్సీ' ఫుట్బాల్ మ్యాచ్ : పాస్ లేకుంటే నో ఎంట్రీ - రాచకొండ పోలీసుల ప్రకటన
ఉప్పల్ స్టేడియంలో జరిగే ఫుట్ బాల్ ప్లేయర్ మెస్సీ ‘గోట్’ ఫుట్బాల్ మ్యాచ్ పై రాచకొండ పోలీసులు కీలక ప్రకటన చేశారు. పాస్ లేకుంటే అనుమతి లేదని స్పష్టం చేశారు.
ఈనెల 13న (శనివారం) తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి– మెస్సీతో ఉప్పల్ మైదానంలో మెస్సీ– గోట్ ఫుట్బాల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం రాచకొండ పోలీసులు భారీగా ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఈ మ్యాచ్ కోసం భారీగా అభిమానులు తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో…. పోలీసులు కీలక ప్రకటన చేశారు.
మెస్సి – గోట్ ఫుట్బాల్ మ్యాచ్ - రాచకొండ పోలీసులు కీలక ప్రకటన
టికెట్ లేదా పాసులు ఉన్న వారు మాత్రమే స్టేడియం వద్దకు రావాలని రాచకొండ సీపీ స్పష్టం చేశారు. వారికి మాత్రమే ప్రవేశం ఉంటుందని… పాస్ లేని వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి ఉండదని స్పష్టం చేశారు. ఈ మ్యాచ్కు అత్యంత కట్టుదిట్టమైన, భారీ బందోబస్తును ఏర్పాటు చేసినట్లు సీపీ పేర్కొన్నారు.
ఉప్పల్ స్టేడియంలో నిర్వహించనున్న ఈ మ్యాచ్కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని సీపీ తెలిపారు. దేశం నలుమూలల నుంచి అభిమానులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో… మ్యాచ్ కోసం భారీబందోబస్తు ఏర్పాటు చేశామని వివరించారు. అభిమానులు పోలీసులకు సహకరించాలని సీపీ కోరారు.
డీజీపీ సమీక్ష…
ఉప్పల్ మ్యాచ్ ఏర్పాట్లపై తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి సమీక్షించారు. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో మెస్సి ఫుట్బాల్ మ్యాచ్కు సంబంధించిన భద్రతా మరియు సమగ్ర ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ప్రేక్షకుల భద్రత, సౌకర్యాల మెరుగుదల, ట్రాఫిక్ నియంత్రణ మరియు ప్రజా మార్గదర్శకాల విస్తృత ప్రచారంపై సంబంధిత శాఖలకు డిజిపి దిశానిర్దేశం చేశారు.
స్టేడియం సెక్యూరిటీ అనుకూలతలు, 39,000 సీట్ల సామర్థ్యాన్ని అధికారులు వివరించారు. అన్ని విభాగాలు సమన్వయంతో ఈ అంతర్జాతీయ ఈవెంట్ను విజయవంతంగా నిర్వహించాలని డీజీపీ ఆదేశించారు.