హైదరాబాద్ - విజయవాడ : సంక్రాంతి వేళ టోల్ ఫ్రీ...? తెలంగాణ సర్కార్ కసరత్తు
సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై రోజుకు లక్ష వాహనాలు రానున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రోడ్డు రవాణాశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆదేశించారు. అంతేకాకుండా టోల్ ఫీజు విషయంలో వాహనాదారులకు ఉపశమనం కలిగించేలా నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంది.
రానున్న సంక్రాంతి వేళ హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై రోజుకు లక్ష వాహనాలు ప్రయాణించే అవకాశం ఉందని తెలంగాణ ప్రభుత్వం అంచనా వేస్తోంది. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణించేందుకు సన్నద్ధం కావాలని అధికారులను ఆదేశించింది. ఇదే విషయంపై రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ముఖ్యంగా టోల్ప్లాజాల వద్ద ట్రాఫిక్కు అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ప్రధానంగా దృష్టి సారించాలన్నారు. జనవరి 8 నుంచి వాహనాల రద్దీ ఉంటుందని…. ఇప్పటి నుంచే ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. వాహనదారుల కోసం ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.
టోల్ ఫీజుపై కేంద్రానికి లేఖ…
ఇక హైవేపై ట్రాఫిక్ జామ్ లను నివారించడానికి టోల్ ప్లాజాల వద్ద ఫ్రీవే ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం…. కేంద్రాన్ని కోరింది. ఈ మేరకు కేంద్ర రవాణాశాఖ మంత్రి నితీన్ గడ్కరీకి మంత్రి వెంకట్ రెడ్డి లేఖ రాశారు. హైదరాబాద్-విజయవాడ హైవేపై పంతంగి, కొర్లపహాడ్, చిల్లకల్లు టోల్గేట్ల వద్ద జనవరి 9 నుంచి 14 వరకు హైదరాబాద్-విజయవాడ మార్గంలో, జనవరి 16 నుంచి 18 వరకు విజయవాడ-హైదరాబాద్ మార్గంలో రద్దీ ఎక్కువగా ఉంటుందని వివరించారు. ప్రజల సౌకర్యార్థం ఆయా టోల్ప్లాజాల వద్ద నేరుగా టోల్ ఫీజు లేకుండా అనుమతించాలని కోరారు.
టోల్ ఫీజు అనివార్యమైతే టోల్ ప్లాజాలకు సంబంధించి నామమాత్రపు చెల్లింపు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు.
టోల్ వసూళ్ల వివరాలపై ఆరా..!
మరోవైపు గడిచిన రెండేళ్లలో సంక్రాంతి పండగ వేళ హైదరాబాద్ - విజయవాడ హైవేపై సాగిన రాకపోకల వివరాలను కూడా ప్రభుత్వం సేకరించినట్లు తెలిసింది. టోల్ ఫీజు ఎంత వసూలు అయిందనే వివరాలపై ఆరా తీసినట్లు సమాచారం.
ఒక వేళ కేంద్రం నుంచి సానుకూలమైన స్పందన రాకపోతే… సంబంధిత టోల్ ఫీజును రాష్ట్ర ప్రభుత్వం భరించే అవకాశం కూడా కనిపిస్తోంది. దీనిపై రాబోయే రోజుల్లో స్పష్టత రానుంది. ఒకవేళ సంక్రాంతి వేళ రాష్ట్ర ప్రభుత్వం టోల్ భారం భరిస్తే…. ప్రయాణికులకు ప్రయాణ ఖర్చు తగ్గడమే కాకుండా, టోల్ ప్లాజాల వద్ద గంటల తరబడి ఏర్పడే ట్రాఫిక్ జామ్లకు కూడా పరిష్కారం దొరికే అవకాశం ఉంటుంది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

