...
...
Next Story

హైదరాబాద్ కేబీఆర్ పార్క్ వద్ద వన్ వే ట్రాఫిక్ ట్రయల్ రన్.. రూట్ డైవర్షన్, నో పార్కింగ్, రూల్స్ ఇవే

హైదరాబాద్ కేబీఆర్ పార్క్ వద్ద పోలీసులు వన్ వే ట్రాఫిక్ ట్రయల్ రన్ ప్రారంభించారు. ప్రత్యామ్నాయ మార్గాల్లో ఎలా వెళ్లాలో వెల్లడించారు.

Updated on: Jun 21, 2026 04:07 PM IST
Advertisement

హైదరాబాద్ నగరంలోని ప్రముఖ కేబీఆర్ పార్క్ పరిసర ప్రాంతాలలో ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించేందుకు ట్రాఫిక్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రాంతంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడమే లక్ష్యంగా ఆదివారం ఉదయం 10:00 గంటల నుండి 'వన్-వే' ట్రాఫిక్ ట్రయల్ రన్ ప్రారంభించారు. ఈ ట్రాఫిక్ మళ్లింపులు, ప్రత్యామ్నాయ మార్గాల గురించిన పూర్తి వివరాలు కింద ఉన్నాయి.

ట్రాఫిక్ మళ్లింపులు - ప్రత్యామ్నాయ మార్గాలు

హైదరాబాద్ కేబీఆర్ పార్క్ వన్ వే ట్రాఫిక్
హైదరాబాద్ కేబీఆర్ పార్క్ వన్ వే ట్రాఫిక్

జుబ్లీహిల్స్ చెక్ పోస్ట్ మూసివేత ఈ వన్-వే నిర్వహణలో భాగంగా జుబ్లీహిల్స్ చెక్ పోస్ట్ మీదుగా వెళ్లే వాహనాలకు అనుమతి నిరాకరించారు.

పంజాగుట్ట టు మాదాపూర్ రూట్: పంజాగుట్ట వైపు నుండి మాదాపూర్ వెళ్లే వాహనాలను బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్, ఫిల్మ్ నగర్ రోడ్ నెం. 45 మీదుగా దారి మళ్లించారు. వాహనదారులు ఈ ట్రాఫిక్ మార్పులను గమనించి, అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

క్షేత్రస్థాయిలో ఉన్నతాధికారుల పర్యవేక్షణ

ఈ వన్-వే విధానం అమలు తీరును, క్షేత్రస్థాయిలో ట్రాఫిక్ పరిస్థితులను నగర పోలీస్ కమిషనర్ స్వయంగా పరిశీలించారు. సీనియర్ ట్రాఫిక్ అధికారులతో కలిసి ఆయన ట్రాఫిక్ మేనేజ్‌మెంట్‌ను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్రయల్ రన్‌ను విజయవంతం చేయడానికి, ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడానికి 150 మంది ట్రాఫిక్ సిబ్బందిని రంగంలోకి దించారు. అంతేకాకుండా భద్రత, అదనపు సహాయం కోసం గ్రేహౌండ్స్, ఆక్టోపస్ బేలగాల సేవలను కూడా వినియోగిస్తున్నారు.

రెండవ విడత ట్రయల్ రన్

హైదరాబాద్ నగర వృద్ధి, మౌలిక వసతుల కల్పనలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌ను చేపట్టిందని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఇందులో భాగంగానే కేబీఆర్ పార్క్ చుట్టూ ఏడు ఫ్లైఓవర్లు, ఏడు అండర్‌పాస్‌లను నిర్మించనున్నారు.

గతంలోలాగే ఈసారి కూడా వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ తమకు పూర్తిస్థాయిలో సహకరించాలని పోలీసులు కోరారు. అందుకోసం పలు కీలక జంక్షన్లలో ట్రాఫిక్ సైన్‌బోర్డులను (దిశానిర్దేశక బోర్డులను) ఏర్పాటు చేశామని, వాటిని గమనిస్తూ ప్రయాణించాలని సూచించారు.

వాకర్స్, అత్యవసర వాహనాలకు సంబంధించిన కీలక రూల్స్

ఈ వన్-వే విధానం వల్ల వాహనాలు ఎక్కడా ఆగకుండా, సుదూర ప్రాంతాల వరకు సజావుగా సాగిపోయేలా ఏర్పాట్లు చేశారు. అంబులెన్స్, ఫైర్ ఇంజన్ వంటి అత్యవసర సేవల వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా తగిన నిర్ణయాలు తీసుకోనున్నారు. కేబీఆర్ పార్కుకు వచ్చే వాకర్స్ రోడ్డు దాటడానికి వీలుగా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇకపై కేబీఆర్ పార్కుకు వాకింగ్ కోసం వచ్చే వారు తమ వాహనాలను రోడ్లపై పార్క్ చేయడానికి వీల్లేదని, రోడ్డుపై పార్కింగ్‌ను పూర్తిగా నిషేధిస్తున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు.

ఈ వన్-వే విధానంపై వాహనదారులు, స్థానిక ప్రజల నుండి పోలీసులు ఫీడ్‌బ్యాక్ సేకరిస్తున్నారు. ఈ ట్రయల్ రన్ ఫలితాలు, ప్రజల నుండి వచ్చే స్పందన ఆధారంగానే భవిష్యత్తులో ఈ వన్-వే విధానాన్ని శాశ్వతంగా కొనసాగించాలా లేదా అనే దానిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe