...
...
Next Story

TG Doctors Strike : తెలంగాణలో డాక్టర్ల సమ్మెబాట - నేటి నుంచి ప్రభుత్వాస్పత్రుల్లో ఓపీ సేవలు బంద్

రాష్ట్రంలో ప్రభుత్వ వైద్యుల బదిలీల ప్రక్రియ తీవ్ర వివాదంగా మారింది. జీవో నంబర్ 38 నిబంధనలను ఉల్లంఘిస్తూ అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ 'తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్' (టీజీజీడీఏ) ఆరోపిస్తోంది. నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా విధులను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది.

Published on: Jun 5, 2026, 10:24:10 IST
Advertisement

Telangana Doctors Strike : రాష్ట్రంలో ప్రభుత్వ వైద్యుల బదిలీల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. వైద్యుల బదిలీల ప్రక్రియలో ప్రభుత్వం నిబంధనలను పూర్తిగా తుంగలో తొక్కుతోందని ఆరోపిస్తూ తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (TGDA) ఆగ్రహం వ్యక్తం చేసింది. బదిలీల్లో పారదర్శకత పాటించాలనే డిమాండ్‌తో ఇవాళ్టి నుంచి రాష్ట్రవ్యాప్తంగా వైద్య సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.

ప్రభుత్వాస్పత్రుల్లో ఓపీ సేవలు బంద్
ప్రభుత్వాస్పత్రుల్లో ఓపీ సేవలు బంద్

ప్రభుత్వం విడుదల చేసిన జీవో నం. 38 ప్రకారం బదిలీలు నిర్వహించకుండా అధికారులు ఏకపక్షంగా సీట్లు కేటాయిస్తున్నారని వైద్యులు ఆరోపిస్తున్నారు. దీనివల్ల వందలాది మంది వైద్యులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

భార్యాభర్తలు ఒకే చోట పనిచేసేందుకు వీలు కల్పించే స్పౌజ్ కేటగిరీ దరఖాస్తులను అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ, ప్రాధాన్యత కోరుతున్న వైద్యుల విజ్ఞప్తులను కూడా పట్టించుకోవటం లేదని చెబుతున్నారు. ఎన్నో ఏళ్లుగా మారుమూల పల్లెల్లో, గిరిజన ప్రాంతాల్లో సేవలు అందించి…. వ్యక్తిగత కారణాలతో రిక్వెస్ట్ బదిలీలు కోరుతున్న వారికి నిరాశే ఎదురవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిబంధనల ప్రకారం గుర్తింపు పొందిన సంఘం నాయకులకు బదిలీల నుంచి మినహాయింపు ఇవ్వాల్సి ఉన్నా…. ఆ నిబంధనను కూడా గాలికొదిలేశారని టీజీడీఏ నేతలు ధ్వజమెత్తారు.

సమ్మె బాటలో వైద్యులు….

వైద్యుల నిరసనల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రధాన ఆసుపత్రులలో వైద్య సేవలు స్తంభించిపోయాయి. హైదరాబాద్‌లోని ఉస్మానియా, గాంధీ, నిలోఫర్ ఆసుపత్రులతో పాటు అన్ని జిల్లాల ప్రధాన ఆసుపత్రుల్లో శుక్రవారం నుంచి వైద్యులు ఓపీ సేవలను పూర్తిగా బహిష్కరిస్తున్నారు.

అత్యవసర సర్జరీలు (Emergency Surgeries) మినహా…. ముందుగా నిర్ణయించిన ఎలక్టివ్ ఆపరేషన్లను కూడా నిలిపివేస్తున్నట్లు సంఘం స్పష్టం చేసింది. జీవో 38లోని ప్రతి నిబంధనను అక్షరాలా అమలు చేసే వరకు తాము బదిలీలకు సంబంధించిన ఆప్షన్ ఫారాలను సమర్పించే ప్రసక్తే లేదని టీజీడీఏ తేల్చి చెప్పింది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe