గత కొంతకాలంగా అవినీతి అధికారుల విషయంలో తెలంగాణ ఏసీబీ దూకుడుగా ముందుకెళ్తోంది. ఇటీవలే కాలంలో చాలా మంది అధికారులు పట్టుబడిన ఘటనలు వెలుగు చూశాయి. నిత్యం ఏదో ఒక చోట అవినీతి అధికారులు దొరికిపోతున్నారు. తాజాగా మహబూబాబాద్ జిల్లాలోని పెద్ద వంగర మండల తహసీల్దార్ ఏసీబీకి చిక్కాడు. రూ. 15 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. అతని ప్రైవేట్ డ్రైవర్ తుప్పాని గౌతమ్ ను కూడా అరెస్ట్ చేశారు.
రూ. 15 వేలు తీసుకుంటూ….

ఏసీబీ అధికారులు విడుదల చేసిన ప్రకటనలోని వివరాల ప్రకారం….మహబూబాబాద్ జిల్లాలోని పెద్ద వంగర మండల పరిధిలోని ఓ మహిళ తన మామ నుంచి వారసత్వంగా రావాల్సిన భూమి గురించి తహసీల్దార్ కు దరఖాస్తు చేసుకుంది.వారసత్వ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రాసెస్ చేయడానికి దరఖాస్తుదారు నుంచి తహసీల్దార్ రూ.15 వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో సదరు మహిళ… ఏసీబీ అధికారులను ఆశ్రయించింది.
పకడ్బందీగా రంగంలోకి దిగిన అధికారులు… తహసీల్దార్ వీరగంటి మహేందర్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. లంచం డబ్బులను తహసీల్దార్ ప్రైవేట్ డ్రైవర్ అయిన గౌతమ్ ద్వారా తీసుకునే క్రమంలో… ఏసీబీ అధికారులు వారిద్దరని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఏ ప్రభుత్వాధికారి అయినా లంచం అడిగితే ఫిర్యాదు చేయాలని ఏసీబీ అధికారులు సూచించారు. అవినీతి నిరోధక శాఖ "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయాలని తెలిపారు. అంతే కాకుండా వివిధ సామాజిక మధ్యమాలయిన "వాట్సాప్ ( 9440446106), ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) లేదా వెబ్ సైట్ ( https://acb.telangana.gov.in ) ద్వారా కూడా సంప్రదించవచ్చని పేర్కొన్నారు. ఫిర్యాదుదారుల సమాచారం గోప్యంగా ఉంచుతామని వివరించారు.