TG Vehicle Registration : ఆర్టీవో ఆఫీసుకు అక్కర్లేదు..! ఇవాళ్టి నుంచి షోరూమ్ వద్దే 'వాహన రిజిస్ట్రేషన్'
రాష్ట్ర రవాణాశాఖలో కొత్త సంస్కరణలు అమల్లోకి వచ్చాయి. నేటి నుంచి వాహనం కొనే షోరూమ్ లోనే రిజిస్ట్రేషన్లు జరగనున్నాయి. రిజిస్టేషన్ కోసం రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లకుండానే పని పూర్తవుతుంది.
కొత్తగా వాహనాలు కొనుగోలు చేయాలనుకునే వారికి ఇకపై రిజిస్ట్రేషన్ బాధలు తప్పనున్నాయి. చాలా సులభంగా డీలర్ షోరూమ్ వద్దనే రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. ఈ సరికొత్త విధానం రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ్టి (జనవరి 23) నుంచి అమల్లోకి వచ్చింది.

ఆర్టీఏ ఆఫీసుకు అక్కర్లేదు…
షోరూమ్ లోనే రిజిస్ట్రేషన్ల నేపథ్యంలో రాష్ట్ర రవాణా శాఖలో మరిన్ని సంస్కరణలు అమలుకానున్నాయి. గతంలో వాహన కొనుగోలుదారులు తాత్కాలిక రిజిస్ట్రేషన్ను(టీఆర్) డీలర్ వద్ద చేసుకునే వారు. శాశ్వత రిజిస్ట్రేషన్కు ఆర్టీఏ కార్యాలయాలకు వెళ్లాల్సి వచ్చేది. కానీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో…. నేటి నుంచి షోరూమ్ డీలర్ల వద్దనే వాహన శాశ్వత రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తవుతుంది. కొత్తగా వాహనం కొన్న వాహనదారుడు రిజిస్టేషన్ కోసం రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లనవసరం ఉండదు.
వాహనాన్ని విక్రయించిన డీలరే….. వాహన శాశ్వత రిజిస్ట్రేషన్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేస్తారు. అవసరమైన పత్రాలను సమర్పిస్తారు. వీటిని పరిశీలించిన తర్వాత ఆర్టీవో కార్యాలయం నుంచి నెంబర్ కేటాయిస్తారు. అవసరమనుకుంటే రవాణా శాఖ అధికారులు డీలర్ వద్ద షోరూంలోనే వాహనాన్ని తనిఖీ చేసే అవకాశం ఉంటుంది.
కొత్త సంస్కరణల అమలు నేపథ్యంలో ఇక నుంచి ఆర్టీవో కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్, క్యూ లైన్లో వెయిటింగ్, కార్డు కోసం తిప్పలు తప్పనున్నాయి. ఈ నిర్ణయంపై వాహనదారులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. వాణిజ్య(కమర్షియల్) వాహనాలకు మాత్రం ఇప్పటి వరకు అమల్లో ఉన్నట్టుగానే రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
షోరూమ్ వద్దనే రిజిస్ట్రేషన్ - రవాణాశాఖ మంత్రి పొన్నం
రవాణా శాఖలో నేటి నుంచి మరిన్ని సంస్కరణలు అమలవుతున్నాయి. కొత్తగా వాహనం కొన్న వాహనదారుడు రిజిస్టేషన్ కోసం రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లనవసరం లేదు. ఎక్కడ వాహనం కొంటే అక్కడ షో రూమ్ ల వద్దనే వాహన శాశ్వత రిజిస్ట్రేషన్ చేయబడుతుంది. రవాణా శాఖలో అన్ని రకాల సేవలు ఆన్లైన్ లోనే చేసే విధంగా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం సారథి లో చేరింది. దీని ద్వారా రవాణా సేవలు సౌకర్యాలు ప్రజలకు మరింత చేరువ కానున్నాయి. రవాణా శాఖ ఈవీ పాలసీ,స్క్రాప్ పాలసీ తీసుకొచ్చింది" అని రాష్ట్ర రవాణశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఓ ప్రకటన ద్వారా తెలిపారు.

E-Paper












