...
...
Next Story

Phone Tapping Case : ఫోన్‌ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావుకు బెయిల్ మంజూరు.. అరెస్ట్ నుంచి మినహాయింపు

Phone Tapping Case : ఫోన్‌ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉ‍న్న ప్రభాకర్‌ రావుకు సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.

Published on: Mar 10, 2026, 15:37:33 IST
Advertisement

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకు భారీ ఊరట దక్కింది. సుప్రీంకోర్టు ప్రభాకర్‌ రావుకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అధికారుల విచారణకు పూర్తిగా సహకరించాలని ప్రభాకర్ రావును అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.

సుప్రీం కోర్టు
సుప్రీం కోర్టు

ప్రభాకర్ రావుకు గతంలో ఇచ్చిన మధ్యంతర బెయిల్‌ను రెగ్యులర్ బెయిల్‌గా జస్టిస్ నాగరత్న ధర్మసనం మార్చింది. కేసు దర్యాప్తునకు పూర్తిగా సహకరించాలని, నిందితుడు ప్రభాకర్ రావుకు ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. అంతేకాకుండా.. ప్రభాకర్ రావు తన పాస్‌పోర్ట్‌ను సరెండర్ చేయాలని కూడా సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. సాక్షులను, ఆధారాలను ప్రభావితం చేయెుద్దని ఆదేశాలు జారీ చేసింది. రూ.35 వేల పూచీకత్తు, ఇద్దరు వ్యక్తుల షూరిటీతో ప్రభాకర్ రావుకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

కోర్టు ముందస్తు అనుమతి లేకుండా రాష్ట్రం లేదా దేశం విడిచి వెళ్లకూడదని ఈ సందర్భంగా న్యాయస్థానం స్పష్టం చేసింది. సాక్షులను భయపెట్టడం, ఆధారాలను ట్యాంపర్ చేయడంలాంటి పనులకు పాల్పడితే బెయిల్ రద్దు అవుతుందని హెచ్చరించింది. ట్రయల్ కోర్టు అనుమతి లేకుండా ఎక్కడకు వెళ్లకూడదని పేర్కొంది. మెుత్తానికి అరెస్ట్ నుంచి మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావుకు మినహాయింపు లభించింది.

ప్రభాకర్ రావుకు బెయిల్ ఇవ్వద్దని, ఆయన బయట ఉంటే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని తెలంగాణ ప్రభుత్వం తరఫు న్యాయవాదులు వాదించారు. అయితే కస్టడీ విచారణ ఇప్పటికే ముగిసినందున ఆయనను ఇంకా జైలులో ఉంచాల్సిన అవసరం లేదని ధర్మాసనం అభిప్రాయపడింది.

తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతలు, వ్యాపారవేత్తలు, సెలబ్రిటీల ఫోన్లను అక్రమంగా ట్యాప్ చేశారనేది ప్రధాన ఆరోపణ. అప్పటి ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు.. ఇందులో కీలకంగా వ్యవహరించారు అనే అభియోగాలు ఉన్నాయి. ఎస్ఐబి పరికరాలను దుర్వినియోగం చేయడం, డేటాను ధ్వంసం చేయడం, ప్రైవేట్ వ్యక్తుల సంభాషణలను వినడంలాంటివి ఈ కేసులో సంచలనంగా మారింది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe