జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా…. ఫార్మర్ కిట్స్ కార్యక్రమైంది. ఇవాళ సచివాలయంలో నిర్వహించిన ‘రైతు నేస్తం’వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఫార్మర్ కిట్స్ పంపిణీ ప్రారంభం…

రంగారెడ్డి జిల్లాకు చెందిన రైతులకు ప్రత్యేక ‘ఫార్మర్ కిట్స్’ను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ….. రసాయన ఎరువులు, పురుగుమందుల మితిమీరిన వాడకం వల్ల మానవ ఆరోగ్యం దెబ్బతింటుందని చెప్పారు. క్యాన్సర్ వంటి వ్యాధులు ప్రబలుతున్నాయన్నారు. భూగర్భ జలాలు, వాతావరణం కలుషితమవుతున్న తరుణంలో…. మన పూర్వీకులు ఆచరించిన ప్రకృతి వ్యవసాయ పద్ధతులే రైతులకు, సమాజానికి క్షేమకరమని స్పష్టం చేశారు.
- రాష్ట్రవ్యాప్తంగా 489 క్లస్టర్లను గుర్తించి… ఒక్కో క్లస్టర్ నుండి 125 మంది చొప్పున మొత్తం 61,125 మంది రైతులను ఈ పథకం కోసం ఎంపిక చేశారు.
- వీరికి అవగాహన తో పాటుగా ఫార్మర్ కిట్లను అందజేశారు.
- ఈ కిట్స్ లో ప్రకృతి వ్యవసాయంపై “క్షేత్ర దర్శిని” పుస్తకం, క్లాత్ బ్యాగ్, గుర్తింపు కార్డు, ప్రత్యేక క్యాలెండర్, టోపీ, పెన్ తో పాటు చిన్న డైరీ ఉంటాయి.
- సచివాలయంలో ఈ కార్యక్రమం ప్రారంభమైన నేపథ్యంలో…. ఆయా జిల్లాల్లోని రైతు వేదికలలో స్థానిక ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా రైతులకు ఫార్మర్ కిట్లను పంపిణీ చేస్తారు.
- ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడంలో భాగంగా ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలు రైతులకు ఎంతగానో ఉపయోగపడతాయని అధికారులు చెబుతున్నారు.
మరోవైపు మార్చి 20, 21, 22 తేదీల్లో ప్రభుత్వం నిర్వహించనున్న ‘రైతు మహోత్సవ’ కార్యక్రమానికి రైతులు భారీగా తరలిరావాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. కార్యక్రమం చివరి రోజున (మార్చి 22) సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా యాసంగి సీజన్ రైతు భరోసా నిధుల జమ కార్యక్రమం జరుగుతుందని వెల్లడించారు.