ఏపీ - తెలంగాణ వెదర్ అప్డేట్స్ : పెరుగుతున్న ఉష్ణోగ్రతలు - ఈ నెలాఖారులో వర్షాలు...!
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం మారుతోంది. దాదాపుగా చలి కాలం పూర్తి కాగా.. పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. అయితే ఈనెలాఖారులో తెలంగాణలో వర్షాలు పడే సూచనలున్నాయి.
ఏపీ తెలంగాణలో వాతావరణం మారుతోంది. గత కొద్దినెలలుగా చలి తీవ్రత కొనసాగగా… ప్రస్తుతం చివరి దశకు వచ్చేసింది. శివరాత్రి రాకతో దాదాపుగా చలి పూర్తి అయినట్లే. ఇదే సమయంలో పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. మధ్యాహ్నం సమయంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటోంది.
ఏపీ తెలంగాణ వెదర్ అప్డేట్స్
ఈ నెలాఖారులో వర్షాలు…
తెలంగాణ వెదర్ మ్యాన్ రిపోర్ట్ ప్రకారం… తెలంగాణలోని చాలా ప్రాంతాలలో రాబోయే కొన్ని రోజులు ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలు దాటనున్నాయి. రాత్రి ఉష్ణోగ్రతలు 17-19 డిగ్రీల మధ్య ఉండే అవకాశం ఉంది. ఇదే సమయంలో కొన్నిచోట్ల అకాల వర్షాలు పడే అవకాశం ఉంది.
ఫిబ్రవరి 25 నుంచి ఫిబ్రవరి 28 తేదీల్లో ఉత్తర, తూర్పు, మధ్య తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో అకాల వర్షాలు పడొచ్చు. ఉరుములతో కూడా గాలులు వీచే అవకాశం ఉంటుంది.ఫిబ్రవరి 19వ తేదీ తర్వాత ఈ వర్షాలకు సంబంధించి మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది.
హైదరాబాద్ వాతావరణ కేంద్రం రిపోర్ట్ ప్రకారం… ఈ వారమంతా కూడా తెలంగాణలో పొడి వాతావరణమే ఉండనుంది. ఎలాంటి హెచ్చరికలు లేవు. హైదరాబాద్ సిటీల కూడా ఇదే మాదిరి వెదర్ ఉండనుంది.
మరోవైపు ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో దక్షిణ బంగాళాఖాతంలో సోమవారంలోగా అల్పపీడనం ఏర్పడే అవకాశముందని ఐఎండీ అంచనా వేసింది. ఈ ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ఉండదని తెలుస్తోంది. ఇక ఏపీలోని పలు ప్రాంతాల్లో పొగమంచు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.
రాబోయే 2 రోజుల్లో కోస్తాంధ్రప్రదేశ్, యానాంలో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు తక్కువగా ఉండే అవకాశం ఉంది.రాయలసీమలో అయితే కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల సెంటిగ్రేడ్ తక్కువగా నమోదయ్యే సూచనలున్నాయి.