ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. పొడి వాతావరణ పరిస్థితులు
తెలుగు రాష్ట్రాల్లో చలి తగ్గుముఖం పట్టింది. ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. తెల్లవారుజామున మాత్రమే చలిగా ఉంటుంది. ఈ మేరకు వాతావరణ శాఖ అప్డేట్ ఇచ్చింది.
తెలుగు రాష్ట్రాలలో వాతావరణం మారిపోయింది. చలి తీవ్రత తగ్గుతూ పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం ప్రధానంగా తెల్లవారుజామున చలి తీవ్రత ఎక్కువగా ఉంది. పగటిపూట ఎండ వేడి పెరుగుతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాతావరణ పరిస్థితిపై వాతావరణ శాఖ అప్డేట్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్లో వాయువ్య, ఈశాన్య దిశల నుండి గాలులు రాష్ట్రవ్యాప్తంగా పొడి వాతావరణాన్ని కలిగిస్తున్నాయి.

కొన్ని ప్రాంతాలలో ముఖ్యంగా ఉదయం సమయంలో పొగమంచు కనిపించవచ్చు. అమరావతి వాతావరణ కేంద్రం ఆది, సోమవారాల్లో పొడి పరిస్థితులు ఉంటాయని, కొన్ని చోట్ల పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. అలాగే మంగళవారం కూడా ఇలాంటి పరిస్థితులు ఉంటాయని అంచనా వేసింది.
ఆంధ్రప్రదేశ్ ఉత్తర తీరం, యానాంలో రాబోయే రెండు రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు ఎక్కువగా ఉండవచ్చు. కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు తక్కువగా ఉండవచ్చని ఉష్ణోగ్రత అంచనాలు సూచిస్తున్నాయి. దక్షిణ తీరంలో కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు ఎక్కువగా ఉంటాయని, కనిష్ట ఉష్ణోగ్రతలలో కనిష్ట మార్పు ఉంటుందని అంచనా. రాయలసీమలో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు తక్కువగా ఉండే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్, యానాం అంతటా కనిష్ట ఉష్ణోగ్రతలు రాబోయే కొన్ని రోజులు స్థిరంగా ఉంటాయని అంచనా. తెలంగాణలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం నివేదించిన ప్రకారం దిగువ స్థాయి గాలులు ప్రధానంగా ఆగ్నేయం నుండి వీస్తాయని, దీని ప్రకారం కొన్ని రోజులు పొడి వాతావరణం కొనసాగుతుంది. ఈ కాలంలో ఉష్ణోగ్రతలో మార్పులు ఉంటాయి. ఆదివారం, సోమవారం, మంగళవారం సహా రాబోయే మూడు రోజులు ఆగ్నేయ గాలులు రాష్ట్రవ్యాప్తంగా పొడి వాతావరణాన్ని తీసుకువస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం నివేదించింది.

E-Paper












