MEA Data : 76,000 మందికిపైగా ఆంధ్రప్రదేశ్ కార్మికులు విదేశాలకు వలసలు!

పని కోసం విదేశాలకు వెళ్లే కార్మికుల వలసలు కొనసాగుతున్నాయి. గత ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ నుంచి చాలా మంది పలు దేశాలకు వెళ్లారు. ఈ సంఖ్య 76 వేలకుపైగానే ఉంది.

Published on: Feb 8, 2026, 16:49:45 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

విదేశీ ఉపాధి, ముఖ్యంగా గల్ఫ్ దేశాలకు వెళ్లేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తారు. ఎందుకంటే కుటుంబాలకు ఆదాయ వనరుగా ఉండటంతో చాలా మంది ఇతర దేశాలకు వెళ్తున్నారు. కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ(MEA) డేటా ప్రకారం, 2021 నుంచి 2025 మధ్య ఆంధ్రప్రదేశ్ నుండి 76,201 మంది కార్మికులు ఈ-మైగ్రేట్ పోర్టల్ ద్వారా వలస అనుమతులు పొందారు. కార్మిక వలసలకు ఇది నిదర్శనంగా చెప్పవచ్చు.

ఏపీ నుంచి వలసలు
ఏపీ నుంచి వలసలు

ఈ ఐదేళ్ల కాలంలో వలసలు హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. దీనికి మహమ్మారి కరోనాతోపాటుగా మరికొన్ని కారణాలు ఉన్నాయి. 2021లో వలసలు చూసుకుంటే.. అత్యల్ప గణాంకాలు ఉన్నాయి. 998 మంది మహిళలు సహా 5,482 మంది కార్మికులు విదేశాలకు వలస వెళ్లారు. 2022లో ఈ సంఖ్య బాగా పెరిగిందనే చెప్పవచ్చు. 4,704 మంది మహిళలు సహా 19,347 మందికి క్లియరెన్స్‌లు వచ్చాయి. 2023లో 16,387 మంది కార్మికులు వలస వెళ్లగా, 2024లో 16,615 మంది వలస వెళ్లారు. ముఖ్యంగా 2025లో అత్యధికంగా మహిళలు వెళ్లారు. 5,787 మంది మహిళలు, 12,583 మంది పురుషులు క్లియరెన్స్ పొందారు.

శ్రీకాకుళం, విజయనగరంతో సహా ఉత్తర కోస్తా ఆంధ్రలోని జిల్లాలలో అధిక వలస స్థాయిలు నమోదయ్యాయి. చాలా కుటుంబాలు ఇలాంటి సంపాదనతోనే బతుకుతున్నాయి. అయితే కార్మికుల భద్రత, ఒప్పంద ఉల్లంఘనలు, విదేశాలలో సకాలంలో సహాయం పొందడంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

విదేశాల్లో ఉన్న భారతీయ పౌరులను రక్షించడం ఇప్పటికీ ప్రాధాన్యతగా ఉందని విదేశాంగ శాఖ నొక్కి చెప్పింది. వలస జనాభా ఎక్కువగా ఉన్న దేశాల్లోని భారత మిషన్లు ఫిర్యాదులను పరిష్కరించడానికి, స్థానిక అధికారులతో సంబంధాలు ఏర్పరచుకోవడానికి లేబర్ వింగ్‌లను నిర్వహిస్తాయి. కార్మికులు 24×7 హెల్ప్‌లైన్‌లు, వాట్సాప్, MADAD, CPGRAMS, e-Migrate వంటి ఫిర్యాదుల వేదికల ద్వారా సపోర్ట్ తీసుకోవచ్చు. బాధిత కార్మికులకు ఆర్థిక, చట్టపరమైన సహాయం ఇండియన్ కమ్యూనిటీ వెల్ఫేర్ ఫండ్ ద్వారా అందుతోంది. ఇది వైద్య సంరక్షణ నుండి స్వదేశానికి తిరిగి పంపడం వరకు అవసరాలను తీరుస్తుంది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More