MEA Data : 76,000 మందికిపైగా ఆంధ్రప్రదేశ్ కార్మికులు విదేశాలకు వలసలు!
పని కోసం విదేశాలకు వెళ్లే కార్మికుల వలసలు కొనసాగుతున్నాయి. గత ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ నుంచి చాలా మంది పలు దేశాలకు వెళ్లారు. ఈ సంఖ్య 76 వేలకుపైగానే ఉంది.
విదేశీ ఉపాధి, ముఖ్యంగా గల్ఫ్ దేశాలకు వెళ్లేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తారు. ఎందుకంటే కుటుంబాలకు ఆదాయ వనరుగా ఉండటంతో చాలా మంది ఇతర దేశాలకు వెళ్తున్నారు. కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ(MEA) డేటా ప్రకారం, 2021 నుంచి 2025 మధ్య ఆంధ్రప్రదేశ్ నుండి 76,201 మంది కార్మికులు ఈ-మైగ్రేట్ పోర్టల్ ద్వారా వలస అనుమతులు పొందారు. కార్మిక వలసలకు ఇది నిదర్శనంగా చెప్పవచ్చు.

ఈ ఐదేళ్ల కాలంలో వలసలు హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. దీనికి మహమ్మారి కరోనాతోపాటుగా మరికొన్ని కారణాలు ఉన్నాయి. 2021లో వలసలు చూసుకుంటే.. అత్యల్ప గణాంకాలు ఉన్నాయి. 998 మంది మహిళలు సహా 5,482 మంది కార్మికులు విదేశాలకు వలస వెళ్లారు. 2022లో ఈ సంఖ్య బాగా పెరిగిందనే చెప్పవచ్చు. 4,704 మంది మహిళలు సహా 19,347 మందికి క్లియరెన్స్లు వచ్చాయి. 2023లో 16,387 మంది కార్మికులు వలస వెళ్లగా, 2024లో 16,615 మంది వలస వెళ్లారు. ముఖ్యంగా 2025లో అత్యధికంగా మహిళలు వెళ్లారు. 5,787 మంది మహిళలు, 12,583 మంది పురుషులు క్లియరెన్స్ పొందారు.
శ్రీకాకుళం, విజయనగరంతో సహా ఉత్తర కోస్తా ఆంధ్రలోని జిల్లాలలో అధిక వలస స్థాయిలు నమోదయ్యాయి. చాలా కుటుంబాలు ఇలాంటి సంపాదనతోనే బతుకుతున్నాయి. అయితే కార్మికుల భద్రత, ఒప్పంద ఉల్లంఘనలు, విదేశాలలో సకాలంలో సహాయం పొందడంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
విదేశాల్లో ఉన్న భారతీయ పౌరులను రక్షించడం ఇప్పటికీ ప్రాధాన్యతగా ఉందని విదేశాంగ శాఖ నొక్కి చెప్పింది. వలస జనాభా ఎక్కువగా ఉన్న దేశాల్లోని భారత మిషన్లు ఫిర్యాదులను పరిష్కరించడానికి, స్థానిక అధికారులతో సంబంధాలు ఏర్పరచుకోవడానికి లేబర్ వింగ్లను నిర్వహిస్తాయి. కార్మికులు 24×7 హెల్ప్లైన్లు, వాట్సాప్, MADAD, CPGRAMS, e-Migrate వంటి ఫిర్యాదుల వేదికల ద్వారా సపోర్ట్ తీసుకోవచ్చు. బాధిత కార్మికులకు ఆర్థిక, చట్టపరమైన సహాయం ఇండియన్ కమ్యూనిటీ వెల్ఫేర్ ఫండ్ ద్వారా అందుతోంది. ఇది వైద్య సంరక్షణ నుండి స్వదేశానికి తిరిగి పంపడం వరకు అవసరాలను తీరుస్తుంది.

E-Paper












