నాంపల్లి అగ్రిప్రమాద ఘటనలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శనివారం మధ్యాహ్నం ఘటన జరగగా… అప్పట్నుంచి నిరంతరంగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. పోలీసు, అగ్నిమాపక శాఖ సిబ్బందితో పాటు ఎన్టీఆర్ఎఫ్ బృందాలు ఈ ఆపరేషన్ లో నిమగ్నమయ్యాయి.

రెస్క్యూ ఆపరేషన్ కు దట్టమైన పొగ ఆటంకంగా మారింది. ఎట్టకేలకు ఇవాళ భవనంలో చిక్కిపోయిన వారిలోని ఐదుగురి మృతదేహాలను గుర్తించారు. వెంటనే మృతదేహాలను ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఇంకా ఎవరైనా చిక్కిపోయారా అనే దానిపై సహాయక బృందాలు గాలిస్తున్నాయి.
ఈ ఘటనలో బేబీ (45),అఖిల్ (11),ప్రణీత్ (8), ఇంతియాజ్(28), హబిబ్(32)లను మృతులుగా గుర్తించారు. దాదాపు 22 గంటలకుపైగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగింది. ఈ ప్రమాదానికి సంబధించి అధికారులు పూర్తి వివరాలను ప్రకటించే అవకాశం ఉంది.
ఈ ఘటనపై హైదరాబాద్ జిల్లా ఇన్ చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అగ్నిమాపక భద్రతా మార్గదర్శకాలను పాటించనందుకు దుకాణ యజమానిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు.