తెలంగాణలోని ఓటర్లకు కేంద్ర ఎన్నికల సంఘం కీలక అప్డేట్ అందించింది. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (Special Intensive Revision - SIR) గడువును పొడిగించింది.
ఆగస్టు 3 వరకు గడువు…

కొత్త(సవరించిన) షెడ్యూల్ ప్రకారం బూత్ స్థాయి అధికారులు (BLO) చేపట్టే ఇంటింటి సర్వే గడువును ఆగస్టు 3, 2026 వరకు పొడిగించారు. గతంలో నిర్ణయించిన గడువు ముగియడంతో… క్షేత్రస్థాయిలో ప్రక్రియను మరింత పారదర్శకంగా పూర్తి చేసేందుకు ఈ అదనపు సమయాన్ని కేటాయించారు. అలాగే పోలింగ్ కేంద్రాల పునర్వ్యవస్థీకరణ, హేతుబద్ధీకరణ ప్రక్రియను కూడా ఆగస్టు 3 నాటికి పూర్తి చేయాలని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
సవరించిన షెడ్యూల్ వివరాలు :
- బీఎల్ఓల ఇంటింటి సర్వే : ఆగస్టు 3, 2026 వరకు పొడిగించారు.
- పోలింగ్ కేంద్రాల పునర్వ్యవస్థీకరణ : ఆగస్టు 3, 2026 నాటికి పూర్తి చేయాలి.
- ఓటర్ల ముసాయిదా జాబితా ప్రచురణ (Draft Publication) : ఆగస్టు 10, 2026 (సోమవారం) నాడు విడుదల చేస్తారు.
- క్లెయిములు, అభ్యంతరాల స్వీకరణ : ఆగస్టు 10, 2026 నుండి సెప్టెంబర్ 9, 2026 వరకు ఓటర్లు తమ అభ్యంతరాలను తెలపవచ్చు లేదా కొత్త ఓటు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
- క్లెయిములు, అభ్యంతరాల పరిష్కారం : ఆగస్టు 10, 2026 నుండి అక్టోబర్ 8, 2026 లోపు వీటిని అధికారులు పరిష్కరిస్తారు.
- ఓటర్ల తుది జాబితా ప్రచురణ : అక్టోబర్ 12, 2026 (సోమవారం) నాడు తెలంగాణ ఓటర్ల తుది జాబితాను అధికారికంగా విడుదల చేస్తారు.
ఈ సవరించిన షెడ్యూల్ సమాచారం…. రాష్ట్రంలోని రాజకీయ పార్టీలన్నింటికీ లిఖితపూర్వకంగా సమాచారం అందించాలని కేంద్ర ఎన్నికల సంఘం అండర్ సెక్రటరీ సందీప్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే ఈ మార్పులపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం కల్పించాలని స్పష్టం చేశారు. ఓటు హక్కు లేని వారు, మార్పులు చేర్పులు చేయాలనుకునే వారు ఈ పొడిగించిన గడువును ఉపయోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.