దేశంలోని పలు రాష్ట్రాల్లో ఓటర్ల సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే తెలంగాణలోనూ ఈ ప్రక్రియ చేపట్టేందుకు షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం 12 రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ కొనసాగుతుండగా…. తెలంగాణతో పాటు మిగిలిన రాష్ట్రాలకు సంబంధించిన షెడ్యూల్ ఏప్రిల్, -మే నెలల మధ్య వెలువడే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించిన వివరాలను సీఈఓ సుదర్శన్రెడ్డి పేర్కొన్నారు.
పారదర్శకంగా ఉండాలి - సీఈవో సుదర్శన్ రెడ్డి

సర్(ఎస్ఐఆర్) ప్రక్రియను అత్యంత పారదర్శకగా, పకడ్బందీగా నిర్వహించాలని చీఫ్ ఎలక్టోరల్ అధికారి(సీఈవో) సుదర్శన్రెడ్డి అధికారులను ఆదేశించారు. సర్ రాష్ట్రంలోని ప్రతి పోలింగ్ స్టేషన్కు కనీసం ఒక బూత్ లెవెల్ ఏజెంట్ (బీఎల్ఏ)ను రాజకీయ పార్టీలు తప్పనిసరిగా నియమించుకోవాలన్నారు.
గురువారం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ…. బూత్ లెవల్ అధికారులతో సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రస్తుతం 12 రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ కొనసాగుతోందని…. తెలంగాణతో సహా మిగిలిన రాష్ట్రాల షెడ్యూల్ను 2026 ఏప్రిల్-మే నెలల్లో ప్రకటిస్తారని రాజకీయ పార్టీలకు తెలియజేశారు.
నోటిఫై చేసిన తర్వాత రివిజన్ కోసం పరిమిత సమయం మాత్రమే అందుబాటులోఉంటుందని… రాష్ట్రంలో ఇప్పటికే సన్నాహక పనులు ప్రారంభమయ్యాయని ఆయన చెప్పారు. ఓటర్ల జాబితాల సవరణ సమయంలో ఖచ్చితత్వం, పారదర్శకత ఉండాలని స్పష్టం చేశారు. సమస్యలను సకాలంలో పరిష్కరించడంలో సహాయపడటానికి ప్రతి పోలింగ్ బూత్ లో కనీసం ఒక బిఎల్ఎ ఉండాలని సీఈవో సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు.
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) సమయంలో…. బిఎల్ఓలు ప్రతి పోలింగ్ ప్రాంతానికి మూడు నుంచి నాలుగుసార్లు సందర్శించే అవకాశం ఉంటుందన్నారు. మొదటి సందర్శనలో లెక్కింపు ఫారాలు పంపిణీ చేయబడతాయని తెలిపారు. ఎవరైనా ఓటర్లు మ్యాపింగ్లో మిగిలిపోతే ఎస్ఐఆర్ సమయంలో తమ వివరాలను నమోదు చేసుకునే వెసులుబాటు ఉంటుందని స్పష్టం చేశారు. అర్హులైన ప్రతిఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే తమ లక్ష్యమన్నారు.