జోగులాంబ గద్వాలలో విషాదం - క్లాస్ రూమ్‌లో అవమానించిన లెక్చరర్..! విద్యార్థి సూసైడ్

పరీక్షల్లో మార్కుల విషయంలో తోటి విద్యార్థుల ముందే లెక్చరర్ దుర్భాషలాడి, చెంపదెబ్బ కొట్టడంతో మనస్తాపానికి గురైన ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. జోగులాంబ గద్వాల జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Published on: Jul 30, 2026, 11:14:43 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

జోగులాంబ గద్వాల జిల్లాలో విషాదకర సంఘటన వెలుగుచూసింది. కళాశాల అధ్యాపకురాలు తోటి విద్యార్థుల ముందే తనను తీవ్రంగా అవమానించి, చెంపదెబ్బ కొట్టారనే తీవ్ర మనస్తాపంతో ఓ ఇంటర్మీడియట్ ద్వితియ సంవత్సరం విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపడమే కాకుండా విద్యార్థి కుటుంబంలో తీవ్ర శోకాన్ని నింపింది.

విద్యార్థి ఆత్మహత్య..! Representational Image
విద్యార్థి ఆత్మహత్య..! Representational Image

గద్వాల మండలం కొత్తపల్లి గ్రామంలో మంగళవారం ఈ దారుణం జరిగింది. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ బైపీసీ రెండో సంవత్సరం చదువుతున్న 18 ఏళ్ల విద్యార్థి…. ఇంట్లో తల్లిదండ్రులు, సోదరుడు బయటకు వెళ్లిన సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సంబంధిత లెక్చరర్‌పై ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు కేసు నమోదు చేసినట్లు పోలీసులు బుధవారం వెల్లడించారు.

మార్కుల పోలికతో మొదలైన వివాదం

పోలీసులు తెలిపిన ప్రాథమిక వివరాల ప్రకారం… జూలై 27న కాలేజీ ప్రాంగణంలో ఒక విద్యార్థినిని సదరు అధ్యాపకురాలు అందరి ముందూ ప్రశంసించారు. ఆ విద్యార్థిని పరీక్షల్లో మంచి మార్కులు సాధించిందని పొగిడారు. అయితే…. ఆ విద్యార్థినికంటే తనకు కేవలం ఒక్క మార్కు మాత్రమే తక్కువ వచ్చిందని, అలాంటప్పుడు ఆమెను మాత్రమే ఎందుకు ప్రత్యేకంగా అభినందిస్తున్నారని మృతుడు ప్రశ్నించాడు. ఇటీవల వెలువడిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఫలితాల్లో బైపీసీ విభాగంలో ఆ విద్యార్థినికి 440 మార్కులకు గానూ 435 మార్కులు వచ్చి కళాశాల ప్రథమ స్థానంలో నిలవగా, మృతుడికి 434 మార్కులు వచ్చి రెండో స్థానం లభించింది.

చెంపదెబ్బ కొట్టి.. ప్రిన్సిపాల్ ముందుకు..

ఆ సదరు ప్రశంసపై విద్యార్థి అభ్యంతరం వ్యక్తం చేస్తూ అధ్యాపకురాలితో వాదనకు దిగాడు. ఈ క్రమంలో విద్యార్థి లెక్చరర్‌ను ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశాడని, దాంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆ ఉపాధ్యాయిని విద్యార్థి చెంప చెల్లుమనిపించిందని పోలీసులు తెలిపారు. అనంతరం ఆ విద్యార్థిని ప్రిన్సిపాల్ వద్దకు తీసుకువెళ్లగా, ఆయన విద్యార్థికి కౌన్సెలింగ్ ఇచ్చారని ప్రాథమిక విచారణలో తేలింది. అయితే అందరి ముందూ లెక్చరర్ కొట్టడం, తిట్టడాన్ని సదరు విద్యార్థి తట్టుకోలేకపోయాడు.

ఆత్మహత్యకు ముందు సదరు విద్యార్థి రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అధ్యాపకురాలు తనను తోటి విద్యార్థుల ముందే తీవ్రంగా కోప పడి, చెంపదెబ్బ కొట్టడం వల్లే తీవ్ర మనస్తాపానికి గురై ఈ ఘోర నిర్ణయం తీసుకుంటున్నట్లు అందులో పేర్కొన్నాడు. అయితే ఈ ఆరోపణలను లోతుగా పరిశీలిస్తున్నామని, సమగ్ర విచారణ తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసు అధికారి తెలిపారు.

అటు మృతుడి కుటుంబసభ్యులు మీడియా ముందు తీవ్రంగా విలపించారు. తమ పిల్లాడు చదువులో చాలా తెలివైనవాడని, జిల్లా స్థాయిలోనే రెండో ర్యాంకు సాధించిన ప్రతిభావంతుడని గుర్తు చేసుకున్నారు. లెక్చరర్ చేసిన తీవ్ర అవమానం తాళలేకే తమ కుమారుడు ప్రాణాలు తీసుకున్నాడని ఆరోపించారు. బాధ్యులైన లెక్చరర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని…. తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More