కరీంనగర్ మేయర్ పీఠంపై సస్పెన్స్.. మారుతున్న రాజకీయ సమీకరణాలు.. కుర్చీ దక్కేది ఎవరికి?
తెలంగాణలో ఇప్పుడు కరీంనగర్ మేయర్ పీఠం వైపు అందరి చూపు ఉంది. నిజానికి బీజేపీ ఇక్కడ అతిపెద్ద పార్టీగా గెలిచినప్పటికీ.. మ్యాజిక్ ఫిగర్ చేరుకోలేకపోయింది. దీంతో ఈ పీఠం ఎవరికి దక్కుతుందా? అనేది చాలా ఇంట్రస్టింగ్గా మారిపోయింది
మున్సిపల్ ఎన్నికలు ముగిశాయి. కానీ స్పష్టమైన మెజారిటీ రాని మున్సిపాలిటీల్లో సమీకరణాలు గంట గంటకు మారుతున్నాయి. ఎవరు ఎవరికి సపోర్ట్ చేస్తారో అర్థంకాని పరిస్థితి నెలకొంది. ఇక కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్పై అందరి చూపు ఉంది. బీజేపీ అతిపెద్ద పార్టీగా ఇక్కడ అవతరించింది. కానీ మ్యాజిక్ ఫిగర్ చేరుకోలేదు. దీంతో అధికార కాంగ్రెస్.. ఎట్టిపరిస్థితిల్లోనూ తగ్గేది లేదని డిసైడ్ అయింది. ఇప్పటికే మంత్రి పొన్నం ప్రభాకర్ పావులు కదుపుతున్నారు.

కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్పై జెండా ఎగురవేసేందుకు పార్టీలు గట్టిగా ప్రయత్నిస్తుండటంతో ఉత్కంఠభరితంగా మారింది. ఫిబ్రవరి 16న మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను గెలుచుకోవడంపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య పోటాపోటి నెలకొంది.
మొత్తం 66 డివిజన్లలో అత్యధికంగా 30 డివిజన్లను బీజేపీ గెలుచుకున్నప్పటికీ మేయర్, డిప్యూటీ మేయర్ పదవులపై కూర్చోవాలంటే అవసరమైన సంఖ్యా బలం లేదు. అధికార కాంగ్రెస్ పార్టీ 14, బీఆర్ఎస్ 9, ఎంఐఎం 3 డివిజన్లను గెలుచుకున్నాయి. మిగిలిన 10 డివిజన్లు స్వతంత్ర అభ్యర్థులకు వెళ్ళాయి. ఇప్పుడు వీరే కీలకం అయ్యారు.
ప్రధాన రాజకీయ పార్టీలకు మేయర్ పదవులను కైవసం చేసుకోవడానికి అవసరమైన మెజారిటీ లేకపోవడంతో ఇప్పుడు అందరి దృష్టి స్వతంత్ర అభ్యర్థులపై ఉంది. వారి మద్దతు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కైవసం చేసుకోవాలని కాంగ్రెస్, బీజేపీ చూస్తున్నాయి. మేయర్ ఎన్నికల ఫలితాన్ని నిర్ణయించడంలో ఎక్స్-అఫిషియో సభ్యుల ఓట్లు కీలక పాత్ర పోషించనున్నాయి.
నలుగురు స్వతంత్ర అభ్యర్థులు ఇప్పటికే పార్టీకి మద్దతు ఇస్తున్నారని, మరికొందరు మేయర్ ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారని స్థానిక బీజేపీ నాయకులు చెబుతున్నారు. స్వతంత్ర అభ్యర్థుల మద్దతుతో మేయర్ సీట్లో బీజేపీ కూర్చుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ నాయకులు సైతం కరీంనగర్ మేయర్ పీఠంపై కూర్చునేందుకు చూస్తున్నారు. దీంతో పోటీ ఆసక్తికరమైన మలుపు తిరిగింది. ముగ్గురు స్వతంత్రులు, ఇద్దరు ఎఐఎఫ్బీ అభ్యర్థులు సహా ఐదుగురు కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముగ్గురు ఎఐఎంఐఎం కార్పొరేటర్లు మద్దతు కూడా తమకే అని చెబుతున్నారు. అంతేకాదు స్వతంత్రుల నుంచి కూడా తమకు మద్దతు ఉందంటున్నారు. దీంతో కరీంనగర్ మేయర్ పీఠం ఆసక్తి నెలకొంది. ఎవరు ఈ కుర్చీలో కూర్చుంటారో చూడాలి.
నిజామాబాద్లోనూ అంతే!
మరోవైపు నిజామాబాద్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇక్కడ ఏ పార్టీకీ స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో మేయర్ పదవికి ఉత్కంఠ నెలకొంది. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లోని మొత్తం 60 డివిజన్లలో 28 డివిజన్లను గెలుచుకుని అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించినప్పటికీ, మేయర్ ఎన్నికల్లో 31 అనే మ్యాజిక్ ఫిగర్ను చేరుకోవడం బీజేపీకి కష్టతరమైన పనిగా ఉంది. 17 డివిజన్లను గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ, 14 డివిజన్లను గెలుచుకున్న AIMIM మద్దతుపై ఆధారపడుతోంది. బీఆర్ఎస్ ఒకే ఒక డివిజన్ను గెలుచుకుంది. గెలిచిన వ్యక్తి కూడా కాంగ్రెస్లో చేరాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది.

E-Paper












