సభలో మూసీ ప్రక్షాళనపై కీలక చర్చ - గోదావరి నీళ్ల తరలింపుపై ప్రకటన, BRS నుంచి ప్రశ్నలు..!

మూసీ నదిని ప్రక్షాళన చేయాల్సిందేనని సీఎం రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. ఇవాళ అసెంబ్లీలో మాట్లాడిన ఆయన… మూసీ, ఈసా నదులను గోదావరి నీళ్లతో నింపుతామని సభలో ప్రకటించారు. మరోవైపు హరీశ్ రావు మాట్లాడుతూ… మూసీ ప్రక్షాళనపై పలు ప్రశ్నలు సంధించారు.

Published on: Jan 2, 2026, 12:07:00 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం తిరిగి ప్రారంభమయ్యాయి. మూసీ ప్రక్షాళనపై సభలో కీలక చర్చ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. మూసీ నదిని ప్రక్షాళన చేయాల్సిందేని స్పష్టం చేశారు. ఫస్ట్‌ ఫేజ్‌లో గండిపేట నుంచి గాంధీ సరోవర్‌ వరకు 21 కి.మీ. అభివృద్ధి చేస్తామన్నారు.

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

వచ్చే మూడు నెలల్లో అంచనాలు ఫైనల్‌ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ADB బ్యాంకు రూ.4,100 కోట్ల రుణం ఇస్తుందని… కేంద్రం కూడా అనుమతి ఇచ్చింద్నారు. వచ్చే నాలుగైదు రోజుల్లో అన్ని వివరాలు బయటకు చెబుతామని వివరించారు.

యూపీలో గంగా ప్రక్షాళన చేశారని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. మూసీని కలుషితం చేయడంతో నల్గొండ జిల్లా ప్రజలు శిక్ష అనుభవిస్తున్నారని పేర్కొన్నారు. మూసీ నదిని ప్రక్షాళన చేయాల్సిందేనని… గోదావరి నుంచి 20 టీఎంసీలు తరలించాల్సి ఉందన్నారు. మూసీ, ఈసా నదులను గోదావరి నీళ్లతో నింపుతామని సభలో ప్రకటించారు.

ఇదే అంశంపై మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ… కీలక వివరాలను వెల్లడించారు. మూసీ సుందరీకరణ జోన్ 1 డీపీఆర్ ను 4 వారాల్లో పూర్తి చేస్తామన్నారు. మూసీ సుందరీకరణను 5 జోన్లుగా విభజించామని వివరించారు.

"మూసీ ప్రాజెక్ట్ 2026 ఫిబ్రవరి లేదా మార్చిలో ప్రారంభమవుతుంది. మరో నాలుగు వారాల్లోనే మూసీ ప్రాజెక్ట్ డీపీఆర్‌ రెడీ అవుతుంది. జోన్-1 రెండేళ్లలోనే పూర్తి చేసేలాగా ప్రణాళికలను రచిస్తున్నాం.

BRS నుంచి ప్రశ్నలు …

కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ కోసం అసలెంత ఖర్చు చేయాలని చూస్తోందని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ప్రశ్నించారు. మూసీ నది సుందరీకరణ పేరుతో పేదల ఇళ్లను కూలుస్తున్నారని తెలిపారు. పేదల ఇళ్ల జోలికి రాకండి అంటూ ప్రభుత్వానికి ఆయన విజ్ఞప్తి చేశారు. దీన్ని బీఆర్ఎస్ పార్టీ ఏమాత్రం ఒప్పుకోదని చెప్పారు. పేదల ఇళ్ల జోలికి వస్తే బుల్డోజర్లకు అడ్డంగా పడుకుంటామన్నారు. ముసీలో మురికి నీళ్లు చేరకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు.

మూసీలోకి గోదావరి జలాలు ఎక్కడి నుంచి వస్తున్నాయనే విషయాన్ని ప్రభుత్వం వెల్లడించాలని హరీశ్ రావు కోరారు. కాళేశ్వరంలో భాగంగా నిర్మించిన మల్లన్న సాగర్ నుంచే ఆ నీళ్లను తీసుకొస్తారా లేదా అనే విషయాన్ని చెప్పాలని డిమాండ్ చేశారు. ఇటీవల వరదలు వచ్చినప్పుడు మూసీ గేట్లు ఉద్దేశపూర్వకంగా ఒకేసారి తెరిచారని గుర్తు చేశారు. ఒకేసారి గేట్లు తెరవడంతో ఇండ్లు, రోడ్లుమునిగిపోయాయని.. ఇది కావాలనే ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వ పెద్దలు చేశారని ఆరోపించారు. ఇది ప్రభు్త్వం దృష్టికి వచ్చిందా? అని ప్రశ్నించారు.

హైదరాబాద్ పరిధిలోని నియోజకవర్గాల్లో నాలాలు సరి చేయకుండా మూసీ సుందరీకరణ చేసినా ఉపయోగం ఉండదని మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ వ్యాఖ్యానించారు. డ్రైనేజ్ నీళ్లు అన్ని మూసీలో కలుస్తున్నప్పుడు, వాటిని అరికట్టకుండా లక్షల కోట్లు పెట్టి మూసీ సుందరీకరణ చేస్తే లాభం ఏంటి? అని ప్రభుత్వాని ప్రశ్నించారు.

సభ ప్రారంభానికి ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళన చేపట్టారు. యూరియా కొరతకు నిరసనగా అసెంబ్లీలో ప్లకార్డులు పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. షాప్‌లలో లేని యూరియా యాప్‌లలో ఉంటుందా అంటూ ప్లకార్డులు ప్రదర్శన చేశారు. అయితే అసెంబ్లీ వద్ద ప్లకార్డులను పోలీసులు లోపలికి అనుమతించలేదు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More