Hyderabad : రూ.9 లక్షల లంచం డిమాండ్ - ఏసీబీకి అడ్డంగా దొరికిపోయిన సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్
సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు చెందిన ఇన్స్పెక్టర్ బాతుల మహేందర్ ఏసీబీకి చిక్కాడు. లంచం డబ్బులు తీసుకునే క్రమంలో ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఆయన ఇంట్లో భారీగా నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నారు.
Cyber Crime Inspector ACB Caught : రాష్ట్రంలోని అవినీతి తిమింగలాలపై అవినీతి నిరోధక శాఖ (ACB) వరుసగా ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా ఓ పోలీస్ అధికారి అడ్డంగా దొరికిపోయాడు. సైబర్ నేరాలను అరికట్టాల్సిన సదరు పోలీస్ అధికారి…. క్విడ్ ప్రో కో తరహాలో నిందితులకు కొమ్ముకాస్తూ భారీగా లంచం డిమాండ్ చేశాడు. లంచం డబ్బులు తీసుకునే క్రమంగా దొరికిపోయాడు.

రూ. 9 లక్షలు లంచం డిమాండ్…
ఏసీబీ శనివారం రాత్రి విడుదల చేసిన అధికారిక ప్రెస్ నోట్ లోని వివరాల ప్రకారం…. హైదరాబాద్లోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో నమోదైన ఒక సైబర్ ఫ్రాడ్ (సైబర్ మోసం) కేసులో ఫిర్యాదుదారుడి కుటుంబ సభ్యులను, స్నేహితులను నిందితులుగా చేర్చకుండా అధికారికంగా లబ్ధి చేకూర్చేందుకు ఇన్స్పెక్టర్ మహేందర్ ఏకంగా రూ.9,00,000 లంచం డిమాండ్ చేశాడు. ఈ డీల్లో భాగంగా బాధితుడి నుంచి ఇదివరకే రూ.5,00,000 నగదును అడ్వాన్స్గా తీసుకున్నాడు.
మిగిలిన లంచం సొమ్ము రూ.4,00,000 తక్షణమే ఇవ్వాలంటూ శనివారం (30.05.2026) తన ఆఫీసులోనే బాధితుడిని మళ్లీ బెదిరించాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం.. శనివారం ఇన్స్పెక్టర్ తన కార్యాలయంలో మిగిలిన లంచం సొమ్ము తీసుకుంటుండగా ఏసీబీ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ (CIU) బృందం అదుపులోకి తీసుకుంది.
నివాసంలో సోదాలు…
ఇన్స్పెక్టర్ మహేందర్ను అదుపులోకి తీసుకున్న అనంతరం ఏసీబీ బృందాలు ఆయన నివాసంలో ఆకస్మిక సోదాలు (రైడ్స్) నిర్వహించాయి. ఈ తనిఖీల్లో లెక్కల్లో చూపని రూ.13,00,000 నగదుతో పాటు భారీగా బంగారు ఆభరణాలు…. కొన్ని కీలకమైన ఆస్తి పత్రాలను అధికారులు కనుగొని, స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి అక్రమాస్తులకు సంబంధించిన పూర్తి వివరాలపై విచారణ ఇంకా కొనసాగుతోందని అధికారులు తెలిపారు.
లంచం తీసుకుంటూ దొరికిపోయిన ఇన్స్పెక్టర్ బాతుల మహేందర్ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. జ్యుడీషియల్ రిమాండ్ నిమిత్తం నాంపల్లిలోని గౌరవనీయ అడిషనల్ స్పెషల్ జడ్జ్ ఫర్ కోర్టులో హాజరుపరచనున్నారు. భ
ప్రభుత్వ కార్యాలయాల్లో లేదా ఏ అధికారి అయినా లంచం డిమాండ్ చేస్తే ప్రజలు భయపడకుండా ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064 కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని అధికారులు కోరారు. చట్టప్రకారం అవినీతిపరులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే వాట్సాప్ (9440446106), ఫేస్బుక్ (Telangana ACB), ఎక్స్/ట్విట్టర్ (@Telangana ACB) ద్వారా కూడా సంప్రదించవచ్చని వెల్లడించారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు పూర్తిగా రహస్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

