పోలీసులపై రియాజ్ కాల్పులు జరపబోయాడు - డీజీపీ శివధర్ రెడ్డి
రియాజ్ ఎన్ కౌంటర్ పై రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి స్పందించారు. ఆస్పత్రిలో ఏఆర్ కానిస్టేబుల్ గన్ లాక్కునేందుకు రియాజ్ ప్రయత్నించారని చెప్పారు. ఈ క్రమంలోనే ఎన్ కౌంటర్ జరిగిందన్నారు.
నిజామాబాద్లో పోలీసుల కాల్పుల్లో నిందితుడు రియాజ్ మృతి చెందిన ఘటనపై రాష్ట్ర డీజీపీ శివధర్రెడ్డి స్పందించారు. రియాజ్ తప్పించుకునే ప్రయత్నం చేశాడని చెప్పారు. ఆస్పత్రిలో రూమ్ బయట ఉన్న ఏఆర్ పోలీసుల గన్ లాక్కునే ప్రయత్నం చేశాడని…. రియాజ్ గన్ ఫైర్ చేసి ఉంటే చాలా ప్రాణాలు పోయేవన్నారు. ప్రజల ప్రాణాలు కాపాడే ప్రయత్నంలోనే పోలీసులు కాల్పులు జరిపారని డీజీపీ వివరించారు.
తెలంగాణ డీజీపీ శివధర్రెడ్డి
కాల్పులపై డీజీపీ శివధర్ రెడ్డి ప్రకటన
“నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రిలో కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో నేరస్థుడైన రియాజ్ మరోసారి పోలీసుల మీద దాడి చేసి పారిపోవడానికి ప్రయత్నించాడు. రియాజ్ ను పట్టుకొనేందుకు పోలీసులు తీవ్ర ప్రయత్నం చేయగా, పోలీసుల దగ్గరున్న ఆయుధాన్ని లాక్కొని పోలీసుల మీద కాల్పులు జరిపే ప్రయత్నం చేశాడు. నిన్న రియాజ్ ను పట్టుకొనేందుకు ఆసిఫ్ అనే పౌరుడు పోలీసులకు సహకరిస్తున్న క్రమంలో అతనిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఆసిఫ్ హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈరోజు పోలీసుల నుండి తుపాకీ లాక్కొని పోలీసులపై కాల్పులు జరిపే ప్రయత్నం చేసి, పారిపోయేందుకు ప్రయత్నించాడు. రియాజ్ ను నివారించడానికి పోలీసులు జరిపిన ప్రయత్నంలో అతను చనిపోయాడు” అని డీజీపీ మహేందర్ రెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు.
ప్రమోద్ కుటుంబానికి రూ. కోటి ఎక్స్ గ్రేషియా - డీజీపీ
తెలంగాణలో లా అండ్ ఆర్డర్ను కాపాడేందుకు పోలీసుశాఖ నిబద్ధతతో ఉందని డీజీపీ శివధర్ రెడ్డి స్పష్టం చేశారు. ఎలాంటి నేరస్తులను అయినా అణచివేస్తామన్నారు. కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి అండగా ఉంటామని ప్రకటించారు. ప్రమోద్ కుటుంబానికి రూ.కోటి ఎక్స్గ్రేషియా ఇస్తున్నట్లు తెలిపారు. ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు 300 గజాల ఇంటి స్థలం ఇస్తామని వెల్లడించారు.