బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు - సుప్రీంకోర్టుకు తెలంగాణ సర్కార్.…!
బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ సర్కార్ కసరత్తు కొనసాగుతూనే ఉంది. హైకోర్టు స్టే ఇవ్వటంతో… సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించినట్లు తెలిసింది.ఇప్పటికే హైకోర్టు తీర్పు కాపీ ప్రభుత్వానికి చేరగా… సీనియర్ కౌన్సిల్తో సుప్రీంకోర్టులో వాదనలు వినిపించాలని సీఎం రేవంత్ నిర్ణయించారు.
బీసీ రిజర్వేషన్లపై జీవో 9పై హైకోర్టు స్టే ఇవ్వటంతో స్థానిక ఎన్నికలకు బ్రేక్ పడినట్లు అయింది. ఎన్నికల సంఘం కూడా నోటిఫికేషన్ నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలపై కసరత్తు చేస్తోంది. హైకోర్టు ఇచ్చిన స్టే సవాల్ చేస్తూ…. సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమైంది.

సుప్రీంకు రాష్ట్ర ప్రభుత్వం…!
జీవో 9, ఎన్నికల నోటిఫికేషన్ అమలును నిలిపివేస్తూ హైకోర్టు ఇచ్చిన స్టేపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని రేేవంత్ సర్కార్ నిర్ణయించినట్లు తెలిసింది. దీనిపై స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. సోమవారం పిటిషన్ దాఖలు చేసే అవకాశాలున్నాయి.
హైకోర్టు తీర్పు కాపీ శుక్రవారం అందుబాటులోకి రాగా… ప్రభుత్వం పూర్తిస్థాయిలో స్టడీ చేసినట్లు తెలిసింది. దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని… సీనియర్ కౌన్సిల్తో సుప్రీంకోర్టులో వాదనలు వినిపించాలని యోచిస్తోంది. ఇదే విషయంపై సీఎం రేవంత్ రెడ్డి పలు సూచనలు చేసినట్లు సమాచారం.
ప్రధానంగా హైకోర్టు ఇచ్చిన స్టేను ఎత్తివేసి ఎన్నికల నిర్వహణకు అనుమతించాలని ప్రభుత్వం కోరనుంది. ఎన్నికల ప్రక్రియ, నామినేషన్ల స్వీకరణ కూడా ప్రారంభమైనందున ఇందులో హైకోర్టు జోక్యం సరికాదని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లనుంది. జనగణనతో పాటు ప్రభుత్వం చేపట్టిన చర్యల వివరాలను కూడా ప్రస్తావించనుంది. బీసీలకు రిజర్వేషన్ కల్పించేందుకు రిజర్వేషన్ల పరిమితిని సవరిస్తూ చట్టం తీసుకువచ్చిన విషయాన్ని కూడా న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లనుంది.
మరోవైపు బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం సవాల్ చేసే అవకాశం ఉండటంతో… పలువురు సుప్రీంకోర్టులో కేవియట్ కూడా దాఖలు చేశారు. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఎవరైనా అప్పీలు దాఖలు చేస్తే తమ వాదనలు కూడా వినాలని కోరారు. తమ వాదనలు వినకుండా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వరాదని కెవియట్ పిటిషన్ లో పేర్కొన్నారు.
మరోవైపు హైకోర్టు తీర్పు కాపీలోని వివరాల ప్రకారం…. 50 శాతం రిజర్వేషన్ల దాటకుండా ఎన్నికలు నిర్వహించుకోవచ్చని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఎన్నికలకు ముందుకు వెళ్లవచ్చని… అయితే రిజర్వేషన్లు మాత్రం 50 శాతానికి మించరాదని స్టే తీర్పు కాపీలో పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే… అక్కడ ఎలాంటి తీర్పు వస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఇక హైకోర్టు విధించిన స్టేను సుప్రీంకోర్టు కూడా సమర్థిస్తే…. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పించే జీవోకు పూర్తిస్థాయిలో బ్రేక్ పడినట్లు అవుతుంది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

