Telangana School Summer Holidays : తెలంగాణలోని విద్యార్థులకు, తల్లిదండ్రులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. వేసవి సెలవుల ముగింపు దశకు చేరుకున్న తరుణంలో స్కూళ్ల రీఓపెనింగ్ తేదీని పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. షెడ్యూల్ ప్రకారం జూన్ 12వ తేదీన పాఠశాలలు తిరిగి ప్రారంభం కావాల్సి ఉండగా…. ఆ తేదీని మార్చుతూ విద్యాశాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. నూతన ఉత్తర్వుల ప్రకారం జూన్ 15వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి.

రాష్ట్రంలో ఎండల తీవ్రత ఇంకా పూర్తిగా తగ్గకపోవడం, ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతుండటంతో విద్యార్థుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జూన్ రెండో వారంలో కూడా భానుడి భగభగలు కొనసాగే అవకాశం ఉందన్న వాతావరణ నివేదికల నేపథ్యంలో…. విద్యాశాఖ ఈ మేరకు వేసవి సెలవులను మరో మూడు రోజుల పాటు పొడిగించింది.
ప్రభుత్వ నిర్ణయంతో అటు విద్యార్థులకు అదనంగా సెలవులు దొరకడమే కాకుండా, ఇటు తల్లిదండ్రులకు కూడా పెద్ద ఊరట లభించింది. జూన్ 15వ తేదీ సోమవారం కావడంతో ఆ రోజు నుంచి విద్యాసంవత్సరం పూర్తిస్థాయిలో ప్రారంభం కానుంది. అన్ని మేనేజ్మెంట్ల పరిధిలోని ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు ఈ ఆదేశాలను ఖచ్చితంగా పాటించాలని…. జూన్ 15 నుంచే తరగతులు నిర్వహించాలని విద్యాశాఖ అధికారులు స్పష్టం చేశారు. పాఠశాలల పునఃప్రారంభానికి అవసరమైన ఏర్పాట్లను, ఉపాధ్యాయుల లభ్యతను ముందే సమీక్షించుకోవాలని అంతర్గత ఆదేశాల్లో పేర్కొన్నారు.