గ్రూప్-1 పరీక్షల ఫలితాలపై తెలంగాణ హైకోర్టులో మంగళవారం వాదనలు ముగిశాయి. పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం తదితరాలకు సంబంధించిన వివాదంపై జనవరి 22న తీర్పు వెలువరించనుంది. గతంలో సెలక్షన్ లిస్ట్ను రద్దు చేస్తూ సింగల్ బెంచ్ తీర్పునివ్వగా… డివిజన్ బెంచ్ స్టే ఇచ్చింది. ఇరువైపు వాదనలు పూర్తి కాగా… జనవరి 22వ తేదీన తుది తీర్పును ప్రకటించనుంది.
ఇరువైపు వాదనలు పూర్తి…

నిబంధనల మేరకే గ్రూప్-1 పరీక్ష జరిగిందని TGPSC తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. పరీక్ష నిర్వహణ తప్పుల తడక జరిగిందని పిటిషనర్ల తరపు న్యాయవాదులు వాదించారు. మరోవైపు ఉద్యోగాలు పొందిన పలువురు అభ్యర్థులు కూడా అప్పీల్ పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం.మొహియుద్దీన్లతో కూడిన ధర్మాసనం మంగళవారం సుదీర్ఘ విచారణ చేపట్టింది.
అభ్యర్థులు తరపున వాదనలు వినిపించిన న్యాయవాదులు… నోటిఫికేషన్ జారీలోని తప్పులను కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అదనంగా వచ్చిన పోస్టులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశం లేకపోయినా 563 కలిపి ఒకే నోటిఫికేషన్ జారీ చేసిందని గుర్తు చేశారు. ప్రిలిమ్స్కు, మెయిన్స్కు వేర్వేరుగా హాల్టికెట్ నంబర్లు కేటాయించారని…. ఇది నిబంధనలకు విరుద్ధమని చెప్పారు. మూల్యాంకన ప్రక్రియ కూడా పారదర్శకంగా నిర్వహించలేదని వాదించారు.
ఇక కమిషన్ తరపు న్యాయవాదులు వాదనల వినిపిస్తూ…. నిబంధనల ప్రకారమే పరీక్షల నిర్వహణ జరిగిందన్నారు. మూల్యాంకన ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించామని వాదించారు.పరీక్షల్లో అర్హత సాధించలేనివారే కోర్టును ఆశ్రయించారని గుర్తు చేశారు. ఇరువైపుల సుదీర్ఘ వాదనలు విన్న న్యాయస్థానం… తుది తీర్పును జనవరి 22న వెలువరించనుంది. ఈ నేపథ్యంలో హైకోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వబోతుందనేది ఉత్కంఠ నెలకొంది.