TG Muncipal Election Result Live Updates : మున్సిపల్ ఓట్ల కౌంటింగ్ - పార్టీల వారీగా ఫలితాలు ఇలా
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ హవా కొనసాగింది. మెజార్టీ స్థానాల్లో పాగా వేసింది. మున్సిపాలిటీలతో పాటు కార్పొరేషన్లలోనూ సత్తా చాటింది. కొన్నిచోట్ల మాత్రమే బీఆర్ఎస్ గెలిచింది. అనుకున్నంత స్థాయిలో బీజేపీ ప్రభావం చూపలేకపోయింది. లైవ్ అప్డేట్స్ ఇక్కడ తెలుసుకోండి….

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ హవా కొనసాగింది.
...Read Moreమాకు ఓటు శాతం పెరిగింది - బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
మున్సిపల్ ఎన్నికల్లో 250 వార్డులను గెలుచుకున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు చెప్పారు. గతంలో బీఆర్ఎస్ గెలిచిన స్థానాల్లో సగం కూడా గెలవలేదన్నారు. మేం ప్రతిపక్షంగానే ఉంటామని… ఏ పార్టీకి సపోర్ట్ చేయమని స్పష్టం చేశారు. బీజేపీకి ఓటు శాతం పెరిగిందని… వార్డులు కూడా గెలిచామన్నారు.
ములుగులో కాంగ్రెస్ విక్టరీ
ములుగు మున్సిపాలిటీకి జరిగిన తొలి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగరవేసింది. మొత్తం 20 వార్డులకు గాను 12 వార్డులను కైవసం చేసుకుని స్పష్టమైన మెజారిటీ సాధించింది. బీఆర్ఎస్ 5, బీజేపీ 1, ఇతరులు 2 చోట్ల విజయం సాధించారు.
కేటీఆర్ రియాక్షన్
“2581 మున్సిపల్ వార్డులలో ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ పార్టీ 750 వార్డులు గెలిచింది. ఈ ఎన్నికల్లో కూడా 30 శాతానికి పైగా సీట్లు బీఆర్ఎస్ పార్టీకి వచ్చాయి. అధికారులను, అధికార యంత్రాంగాన్ని, అధికార బలాన్ని అడ్డం పెట్టుకొని గెలిచినామా అంటే గెలిచినట్లు కాంగ్రెస్ గెలిచింది” అంటూ కేటీఆర్ కామెంట్స్ చేశారు.
ప్రియాంక గాంధీ అభినందనలు
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించడంపై ఎంపీ ప్రియాంక గాంధీ… ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై చర్చ జరిగింది. రేవంత్ రెడ్డిని ఆమె ప్రత్యేకంగా అభినందించారు.
ప్రజా పాలనకు పట్టం కట్టారు - డిప్యూటీ సీఎం భట్టి
ప్రజా పాలనకు ప్రజలు పట్టం కట్టారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. ప్రభుత్వంపై నమ్మకం, విశ్వాసం ఆదరణగా మారిందన్నారు. కార్యకర్తలు గెలుపే లక్ష్యంగా శ్రమించారని వ్యాఖ్యానించారు.
జగిత్యాలలో ఇండిపెండెట్ల హవా..!
జగిత్యాల మున్సిపాలిటీలో ఆసక్తికరమైన ఫలితాలు వచ్చాయి. మొత్తం 50 వార్డులకు గానూ కాంగ్రెస్ 12, బీజేపీ 4, బీఆర్ఎస్ 4 చోట్ల గెలిచింది. అయితే 14 వార్డుల్లో స్వతంత్ర అభ్యర్థులు విక్టరీ కొట్టారు. వీరంతా కూడా జీవన్ రెడ్డి వర్గానికి సంబంధించిన వారుగా ఉన్నారు.
నల్గొండ కార్పొరేషన్ కైవసం
నల్గొండ కార్పొరేషన్లోని మొత్తం 48 డివిజన్లకు కాంగ్రెస్ 27 గెలిచింది. బీఆర్ఎస్-9, బీజేపీ-4, AIFB-4, మజ్లిస్-2, స్వతంత్రులు రెండు చోట్ల గెలిచారు. మేయర్ గా కాంగ్రెస్ అభ్యర్థికే అవకాశం రానుంది.
రామగుండంలోనూ హస్తం హవా…
రామగుండం కార్పొరేషన్లో 60 డివిజన్లకు గాను 34 డివిజన్లకు ఫలితాలు వెలువడ్డాయి. అందులో 22 వార్డులలో కాంగ్రెస్ కైవసం చేసుకుంది. మరికొన్ని డివిజన్లలోనూ కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచే అవకాశం ఉంది.
మంచిర్యాలలోనూ కాంగ్రెస్
మంచిర్యాల కార్పొరేషన్లో మొత్తం 60 డివిజన్లు ఉండగా ఇందులో కాంగ్రెస్ పార్టీ 50 డివిజన్లలో విజయం సాధించి మరో మూడింట్లో ఆధిక్యంలో కొనసాగుతోంది.
కరీంనగర్ లో బీజేపీ
కరీంనగర్ కార్పొరేషన్లో మొత్తం 66 డివిజన్లు ఉండగా ఎక్కువ డివిజన్లలో బీజేపీ లీడ్ లో ఉంది.
కొత్తగూడెంలో సీపీఐ
కొత్తగూడెం కార్పొరేషన్ ను సీపీఐ కైవసం చేసుకుంది. కొత్తగూడెంలో మొత్తం 47 డివిజన్లు ఉండగా… సీపీఐ 25, కాంగ్రెస్ 14, బీఆర్ఎస్ 4, బీజేపీ 1, సీపీఎం 1, ఇండిపెండెంట్లు ఇద్దరు గెలిచారు.
బీఆర్ఎస్ గెలిచిన మున్సిపాలిటీలు
ఇక ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ కొన్ని మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. సంగారెడ్డి జిల్లాలోని గడ్డపోతారం, ఇంద్రేశం, గుమ్మడిదలలో వికర్టీ కొట్టింది. జోగులాంబ గద్వాల జిల్లాలోని అయిజ, మహబూబాద్ జిల్లాలోని తొర్రూరు, రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం, సూర్యాపేట జిల్లాలోని తిరుమలగిరి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని ఎల్లంపేట మున్సిపాలిటీలను గెలుచుకుంది. అంతేకాకుండా మూడుచింతలపల్లి మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకోగా.. జర్వేల్ లో కూడా విక్టరీ కొట్టింది. కల్వకుర్తి నియోజకరవర్గంలోని ఆమనగల్లులో కూడా విజయం సాధించింది.
90 స్థానాల్లో కాంగ్రెస్ పాగా
మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు కొనసాగించింది. 116 మున్సిపాలిటీల్లో 90 స్థానాల్లో కాంగ్రెస్ పాగా వేసింది. 12 మున్సిపాలిటీలకే బీఆర్ఎస్ పరిమితమైంది. మరో 12 మున్సిపాలిటీల్లో హంగ్ నెలకొంది. ఇక బీజేపీ ఒకే మున్సిపాలిటీకి పరిమితమైంది. భైంసాలో ఎంఐఎం అత్యధిక వార్డులు గెలిచింది.
ఇస్నాపూర్లో టెన్షన్ టెన్షన్…
సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్లో ఉద్రిక్తత నెలకొంది. మున్సిపల్ పీఠం కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు మ్యాజిక్ ఫిగర్ దక్కలేదు. మొత్తం 26 వార్డుల్లో కాంగ్రెస్ 10, బీఆర్ఎస్ 12, స్వతంత్ర అభ్యర్థులు 4 స్థానాల్లో గెలుపొందారు. మ్యాజిక్ ఫిగర్ కోసం 2 సీట్ల దూరంలో బీఆర్ఎస్, 4 సీట్ల దూరంలో కాంగ్రెస్ ఉంది. స్వతంత్ర అభ్యర్థులను కౌంటింగ్ సెంటర్ నుంచి క్యాంపులకు తరలించేందుకు రెండు పార్టీల యత్నిస్తున్నాయి.
430 వార్డుల్లో ముందంజలో ఉన్న కాంగ్రెస్
రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ 430 వార్డుల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. బీఆర్ఎస్ 222 వార్డుల్లో ముందంజలో ఉండగా, భారతీయ జనతా పార్టీ (BJP) 61 వార్డుల్లో లీడ్లో ఉండి మూడో స్థానంలో నిలిచింది. ఇతరులు, స్వతంత్ర అభ్యర్థులు 59 వార్డుల్లో ప్రభావం చూపుతున్నట్లు ఏఎన్ఐ (ANI) వార్తా సంస్థ నివేదించింది.
పలు చోట్ల ఉద్రిక్తతలు
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకుపోతోంది. మొత్తం 116 మున్సిపాలిటీల్లో ఇప్పటికే 37 చోట్ల హస్తం పార్టీ జయకేతనం ఎగురవేయగా.. బీఆర్ఎస్ 7 స్థానాలకే పరిమితమైంది. కరీంనగర్, సంగారెడ్డిలో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.
ఆమనగల్ లో గులాబీ జెండా
రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మున్సిపాలిటీని బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. మొత్తం 15 వార్డులకు గాను బీఆర్ఎస్ 8, బీజేపీ 6, కాంగ్రెస్ 1 వార్డుల్లో గెలుపొందింది.
తెలంగాణ మున్సిపాలిటీల ఫలితాలు
2582 వార్డులకు గానూ మధ్యాహ్నం 2 గంటల వరకు 1965 వార్డుల్లో ఫలితాలు వచ్చాయి. వీటిల్లో కాంగ్రెస్ 1040, బీఆర్ఎస్ 562, బీజేపీ 181, స్వతంత్రులు 182 చోట్ల గెలిచారు.
కరీంనగర్ సిటీలో బీజేపీ హవా…!
కరీంనగర్ కార్పొరేషన్లో బీజేపీ హవా కొనసాగుతోంది. కరీంనగర్లో మొత్తం 66 డివిజన్లు ఉండగా బీజేపీ-23, కాంగ్రెస్-14, మజ్లిస్-5, బీఆర్ఎస్-4, ఇతరులు 4 చోట్ల గెలిచారు.
వర్ధన్నపేటలో హంగ్
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీలో హంగ్ ఏర్పడింది. మొత్తం 12 వార్డుల్లో 6 వార్డుల్లో బీఆర్ఎస్, 5 వార్డుల్లో కాంగ్రెస్, 1 వార్డులో ఇండిపెండెంట్ అభ్యర్థులు విజయం సాధించారు.
జనగామలో హోరాహోరీ
జనగామ మున్సిపాలిటీలో ఛైర్మన్ పీఠం కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. మొత్తం 30 వార్డుల్లో ఇరు పార్టీలు చెరో 13 స్థానాలు గెలుచుకోగా, నలుగురు స్వతంత్రులు కింగ్ మేకర్లుగా మారారు. 15వ వార్డు నుంచి గెలుపొందిన బీఆర్ఎస్ రెబెల్ ఇండిపెండెంట్ అభ్యర్థి పాండు గెలుపొందారు. ముగ్గురు ఇండిపెండెంట్లు తనతోనే ఉన్నారని…. తమలో ఒకరికి ఛైర్మన్ పదవి ఇవ్వాలని పాండు డిమాండ్ చేశారు.
సూర్యాపేటలో కాంగ్రెస్
సూర్యాపేట మున్సిపాలిటీని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. మొత్తం 48 వార్డులలో కాంగ్రెస్ 31, బీఆర్ఎస్ 10, ఇండిపెండెంట్ 6, బీజేపీ ఒక చోట గెలిచింది.
జహీరాబాద్ లో హంగ్
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మున్సిపాలిటీలో హంగ్ నెలకొంది.మొత్తం 37 వార్డులకు గాను 15 వార్డుల్లో బీఆర్ఎస్, 14 వార్డుల్లో కాంగ్రెస్ నెగ్గింది. 3 వార్డుల్లో బీజేపీ, 2 వార్డుల్లో ఎంఐఎం, 3 వార్డుల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులు విజయం సాధించారు.
సిరిసిల్లలో బీఆర్ఎస్ విక్టరీ
సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికలో బీఆర్ఎస్ విజయం సాధించింది. 39 వార్డులకు 27 వార్డులు కైవసం చేసుకుంది. 6 వార్డుల్లో కాంగ్రెస్, 5 వార్డుల్లో బీజేపీ, 1 వార్డులో ఇండిపెండెంట్ అభ్యర్థులు విజయం సాధించారు.
ఇబ్రహీంపట్నం కారుదే…
ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పీఠాన్ని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మొత్తం 24 వార్డులకు గాను 13 వార్డుల్లో బీఆర్ఎస్, 8 వార్డుల్లో కాంగ్రెస్, 2 వార్డుల్లో బీజేపీ విక్టరీ కొట్టింది. ఒక చోట ఇండిపెండెంట్ అభ్యర్థి గెలిచారు.

E-Paper

