లెక్క కుదిరింది.. కాషాయ పార్టీకి లైన్ క్లియర్.. కరీంనగర్ మేయర్ కుర్చీ బీజేపీదే!
కరీంనగర్ మేయర్ పీఠంపై నెలకొన్న సస్పెన్స్కు తెరపడింది. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ కుర్చీని బీజేపీ దక్కించుకుంది.
గత రెండు మూడు రోజులుగా కరీంనగర్ రాజకీయం రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్శించింది. కారణం మేయర్ పీఠంపై ఎవరు కూర్చుంటారు? అనే విషయంపై సందిగ్ధత ఉండేది. చివరకు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలుచుకున్న బీజేపీనే మేయర్ పీఠంపై కూర్చుంది. నిజానికి కాంగ్రెస్ తీవ్రంగా ఈ స్థానం కోసం ప్రయత్నం చేసింది. కానీ లెక్కలు కుదరలేదు. దీంతో కాషాయ పార్టీకి లైన్ క్లియర్ అయింది.

34 మంది కార్పొరేటర్ల మద్దతుతో కాషాయ జెండా ఎగురవేసింది. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు బీజేపీ కార్పొరేటర్లు కొలగాని శ్రీనివాస్, వై.సునీల్ రావులను నిలబెట్టింది. వారే గెలిచినట్టుగా ఎన్నికల అధికారి ప్రకటించారు. దీంతో ఉత్కంఠకు తెరపడింది. నిజానికి మేయర్ పీఠం దక్కించుకునేందుకు బండి సంజయ్ చేసిన వ్యూహాలు ఫలింతాయి. ఎక్స్ అఫీషియో ఓట్లు కీలకంగా మారాయి.
కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితం హంగ్ సృష్టించింది. బీజేపీ అత్యధికంగా 30 డివిజన్లను గెలుచుకుంది. తరువాత కాంగ్రెస్ (14), బీఆర్ఎస్ (9), ఏఐఎంఐఎం (3), AIFB (2), మిగిలిన డివిజన్లలో స్వతంత్రులు గెలిచారు. కరీంనగర్ సిటీలో మొత్తం 66 డివిజన్లలో అత్యధికంగా 30 డివిజన్లను బీజేపీ గెలుచుకున్నప్పటికీ మేయర్, డిప్యూటీ మేయర్ పదవులపై ఉత్కంఠ నెలకొంది. తాజాగా 34 మంది బీజేపీకి, 21 మంది కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపారు. బీఆర్ఎస్ తటస్థంగా ఉంది. దీంతో కరీంనగర్ మేయర్ పీఠం బీజేపీ ఖాతాలోకి వెళ్లింది.
కరీంనగర్ కైవసం చేసుకోవాలని బీజేపీ, కాంగ్రెస్ చేసిన ప్రయత్నాలు అందరి దృష్టిని ఆకర్శించాయి. బీఆర్ఎస్ వైఖరి ఎలా ఉంటుందోనని అందరూ అనుకున్నారు. కానీ తటస్థంగా వ్యవహరించింది. దీంతో బీజేపీకి రూటు క్లియర్ అయింది. మేయర్ స్థానాన్ని కైవసం చేసుకుంది.
నిజామాబాద్లో కాంగ్రెస్ మేయర్
నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో కాంగ్రెస్ అభ్యర్థి ఉమారాణి మేయర్గా ఎన్నికయ్యారు. మేయర్ ఎన్నికల్లో ఆమెకు 34 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థికి 31 ఓట్లు వచ్చాయి. నిజానికి ఇక్కడ కూడా బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. కానీ ఏ పార్టీకీ స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో మేయర్ పదవికి ఉత్కంఠ నెలకొంది. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లోని మొత్తం 60 డివిజన్లలో 28 డివిజన్లను బీజేపీ గెలుచుకుంది. మేయర్ ఎన్నికల్లో మ్యాజిక్ ఫిగర్ను చేరుకోవడం బీజేపీకి కష్టతరమైన పనిగా ఉంది. 17 డివిజన్లను గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ, 14 డివిజన్లను గెలుచుకున్న ఎంఐఎం మద్దతుపై ఆధారపడింది.
బీఆర్ఎస్ ఒకే ఒక డివిజన్ను గెలుచుకుంది. ఆ వ్యక్తి కూడా కాంగ్రెస్లో చేరారు. దీంతో కాంగ్రెస్ పార్టీకి 18 స్థానాలు అయ్యాయి. ఎంఐఎం 14 ఓట్లు కూడా కాంగ్రెస్కే పడ్డాయి. మరోవైపు ఎక్స్ అఫీషియో ఓట్లతో బలాన్ని 34కు పెంచుకుంది హస్తం పార్టీ. దీంతో మేయర్ పీఠానికి లైన్ క్లియర్ అయింది.
ఇదిలా ఉండగా నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్గా కాంగ్రెస్ అభ్యర్థి చైతన్య శ్రీనివాస్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మహబూబ్నగర్ మేయర్గా కాంగ్రెస్కు చెందిన గుమల్ మమత ఎంపికయ్యారు.

E-Paper












