కరీంనగర్ మేయర్ పీఠంపై ఉత్కంఠ - క్షణక్షణం మారుతున్న సమీకరణాలు..!
కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పై ఉత్కంఠ కొనసాగుతోంది. మేయర్ ఎన్నికల్లో పాల్గొనకూడదని బీఆర్ఎస్ నిర్ణయం తీసుకోవటంతో… ఫైనల్ గా ఏం జరగబోతుందనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు మేయర్ పీఠంపై బీజేపీ ధీమాగా ఉంది.
కరీంనగర్ మేయర్ పీఠంపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఇవాళ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక ఉండగా…. కార్పొరేట్లను తరలించేందుకు ఆయా పార్టీలు సిద్ధమయ్యాయి. అయితే చివరి నిమిషంలో బీఆర్ఎస్ ట్విస్ట్ ఇచ్చింది. ఎన్నికల్లో పాల్గొనకూడదని నిర్ణయం తీసుకుంది. దీంతో ఇక్కడ క్షణం క్షణం సమీకరణాలు మారిపోతున్నాయి.
కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్
మేయర్ పీఠం ఎవరికి..?
కరీంనగర్ కార్పొరేషన్లో స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో హంగ్ ఏర్పడింది. కానీ మేయర్ సీటు కైవసం చేసుకుంటామని బీజేపీ ప్రకటించింది. స్వతంత్రుల మద్దతును కూడా కూడగట్టింది. హైదరాబాద్ లో క్యాంపును కూడా ఏర్పాటు చేసింది. ముందుగా కాస్త సైలెంట్ గా ఉన్న కాంగ్రెస్… చివర్లో ట్విస్ట్ ఇచ్చింది. తాము కూడా మేయర్ రేసులో ఉన్నామని ప్రకటించింది. దీంతో కరీంనగర్ మేయర్ పీఠం ఎవరికి దక్కబోతుందనేది టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.
కరీంనగర్ సిటీలో మొత్తం 66 డివిజన్లలో అత్యధికంగా 30 డివిజన్లను బీజేపీ గెలుచుకున్నప్పటికీ మేయర్, డిప్యూటీ మేయర్ పదవులపై కూర్చోవాలంటే అవసరమైన సంఖ్యా బలం లేదు. అధికార కాంగ్రెస్ పార్టీ 14, బీఆర్ఎస్ 9, ఎంఐఎం 3 డివిజన్లను గెలుచుకున్నాయి. మిగిలిన 10 డివిజన్లు స్వతంత్ర అభ్యర్థులకు వెళ్ళాయి. ఇప్పుడు వీరే కీలకం అయ్యారు.
ఇప్పటికే ఆల్ ఇండియా ఫార్వర్డ్ అభ్యర్థితో పాటు మరో ముగురికి బీజేపీ కండువా కప్పింది. ఎంపీ బండి సంజయ్ ఎక్స్ ఆఫీషియో ఓటు మ్యాజిక్ ఫీగర్ చేరుకుంటుంది. కానీ…బీజేపీ క్యాంపులో ఉన్న స్వతంత్ర అభ్యర్థులను తమవైపునకు తిప్పుకునేలా కాంగ్రెస్ గట్టిగా ప్రయత్నాలు చేస్తోంది.
నిజానికి కాంగ్రెస్ కు 14 మాత్రమే రాగా… సొంతగా మేయర్ పీఠాన్ని దక్కించుకోలేదు. ఇతర పార్టీల మద్దతు అవసరం. కానీ చివరి నిమిషంలో ఎన్నిక ప్రక్రియ నుంచి బీఆర్ఎస్ తప్పుకోవటంతో…. సమీకరణాలు పూర్తిగా మారిపోనున్నాయి. దాదాపుగా ఇక్కడ బీజేపీ జెండా ఎగరటం ఖాయంగా కనిపిస్తోంది. ఆ దిశగా కేంద్రమంత్రి బండి సంజయ్ చక్రం తిప్పుతున్నారు.