హైదరాబాద్లో ఇంటి స్థలం కొనాలనుకుంటున్నారా..? బహిరంగ వేలానికి 163 ఓపెన్ ప్లాట్లు, ఈ ఛాన్స్ మిస్ చేసుకోకండి..!
హైదరాబాద్ శివారులోని తొర్రూర్, బహదూర్పల్లి, కుర్మల్గూడ ప్రాంతాల్లో ఉన్న 163 రాజీవ్ స్వగృహ ఓపెన్ ప్లాట్లకు బహిరంగ వేలం జరగనుంది. ఈ మేరకు రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ప్రకటన విడుదల చేసింది. రిజిస్ట్రేషన్ కు నవంబర్ 15వ తేదీని తుది గడువుగా నిర్ణయించింది.
హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ప్లాట్ కోనుగొలు చేయాలని చూస్తున్నారా..? అయితే మీలాంటి వారికి రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ గుడ్ న్యూస్ చెప్పింది. తొర్రూర్, బహదూర్పల్లి, కుర్మల్గూడ ప్రాంతాల్లో ఉన్న 163 రాజీవ్ స్వగృహ ఓపెన్ ప్లాట్లకు బహిరంగ వేలం నిర్వహించనుంది. ఇందుకు సంబంధించిన తేదీలను వివరాలను ప్రకటించింది.
రాజీవ్ స్వగృహ ఓపెన్ ప్లాట్ల విక్రయం
ఈనెల 17,18 తేదీల్లో వేలం…
స్వగృహ కార్పొరేషన్ ద్వారా అభివృద్ధి చేసిన లే అవుట్లలో నివాస భవనాల నిర్మాణానికి అనువైన ప్లాట్లను బహిరంగ వేలం ద్వారా విక్రయించనున్నారు. నగరానికి సమీపంలో ఉన్న తొర్రూర్, బహూదూర్ పల్లి, కుర్మల్ గూడ ప్రాంతాల్లోని 163 ఓపెన్ ప్లాట్లను నవంబర్ 17, 18 తేదీల్లో బహిరంగ వేలం ద్వారా విక్రయిస్తున్నట్లు తెలంగాణ రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ మేనేజింగ్ డైరక్టర్ శ్రీ వి.పి.గౌతం ప్రకటించారు.
ఔటర్ రింగ్ రోడ్ కు అతి చేరువలోని తొర్రూర్ ప్రాంతంలో 200 – నుంచి 500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న125 ప్లాట్లు, కుర్మల్ గూడ లో 200-300 చదరపు గజాల విస్తీర్ణంలోని 25 ప్లాట్లు, బహదూర్ పల్లిలో 200 -1000 గజాల్లోని 13 ప్లాట్లను విక్రయానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఎటువంటి వివాదాలు లేని, ఈ ప్లాట్లలో తమ అభిరుచులకు అనుగుణంగా ఇండ్లను నిర్మించుకోవచ్చ, ఈ లే అవుట్లలో ఇప్పటికే మౌలిక వసతుల కల్పన కూడా పూర్తి అయ్యింది.
ఈ ప్లాట్ల కొనుగోలుకు ఆసక్తి ఉన్న వారు ఈ నెల 15 వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని మేనేజింగ్ డైరక్టర్ వివరించారు. పెద్ద అంబర్ పేట్ లోని అవికా కన్వెన్షన్ లో నవంబరు 17,18 తేదీల్లో తొర్రూర్ ప్రాంతంలోని 125 ప్లాట్లకు, 18 వ తేదీ మధ్యాహ్నం నుంచి బహదూర్ పల్లి, కుర్మల్ గూడల్లోని ప్లాట్లకు బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు ఎండి గౌతమ్ పేర్కొన్నారు.
తొర్రూర్ పై ఫోకస్…!
రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ఆధ్వర్యంలోని ఓపెన్ ప్లాట్ల విక్రయాలపై అనేక మంది ఆసక్తి కనబరుస్తున్నారు. తొర్రూర్ లోని ప్రాజెక్టు సైట్ లోని ప్లాట్లను స్వయంగా చూసుకుని నచ్చిన ప్లాట్ల నెంబర్లను నోట్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా మౌలిక సదుపాయాల గురించి వాకబు చేస్తున్నారు. ఇప్పటికే ఈ లే అవుట్ లో ఇండ్లు కట్టుకుని నివసిస్తున్న వారితో మాట్లాడటం తోపాటు, ప్లాట్ల వాస్తును చూసుకుంటూ సందడి చేస్తున్నారు.
తొర్రూర్ లే అవుట్ లో ఉన్న885 ప్లాట్లలో విడతల వారీగా ఇప్పటివరకు 517 ప్లాట్లను విక్రయించారు. మిగిలిన వాటిలో ప్రస్తుతం 125 ప్లాట్లకు బహిరంగ వేలం నిర్వహిస్తున్నారు. ఈ ప్రాంతంలో గృహావసరాల భూములకున్న డిమాండ్ ఉండటంతో, శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో కొనుగోలుదారులు ఆసక్తి కనబరుస్తున్నారని అధికారులు చెబుతున్నారు.
News/Telangana/హైదరాబాద్లో ఇంటి స్థలం కొనాలనుకుంటున్నారా..? బహిరంగ వేలానికి 163 ఓపెన్ ప్లాట్లు, ఈ ఛాన్స్ మిస్ చేసుకోకండి..!
News/Telangana/హైదరాబాద్లో ఇంటి స్థలం కొనాలనుకుంటున్నారా..? బహిరంగ వేలానికి 163 ఓపెన్ ప్లాట్లు, ఈ ఛాన్స్ మిస్ చేసుకోకండి..!