రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ షురూ అయింది. గురువారం నుంచి నామినేషన్లను స్వీకరిస్తున్నారు. ఎన్నకల ప్రక్రియను సజావుగా జరిపేందుకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల ప్రక్రియను సజావుగా సాగేందుకు వీలుగా ప్రత్యేకంగా ఓ యాప్ ను కూడా ప్రారంభించింది.
ప్రత్యేకంగా యాప్…

గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఈసీ Te-Poll Mobile యాప్ ను ప్రారంభించింది. దీని ద్వారా ఓటర్లు తమ పోలింగ్ స్టేషన్ వివరాలను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏమైనా ఇబ్బందులు ఉంటే ఫిర్యాదు చేయటమే కాకుండా స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు.
ఓటర్లు తమ ఓటరు స్లిప్ మరియు పోలింగ్ స్టేషన్ వివరాలను డౌన్ లోడ్ చేసుకునే వీలుంటుంది. యాప్ ఉపయోగించి ఫిర్యాదులను అప్ లోడ్ చేసుకోవచ్చని ఎన్నికల సంఘం ఓ ప్రకటన ద్వారా తెలిపింది.
' టీ-పోల్ మొబైల్ యాప్'ను ప్లేస్టోర్లో అందుబాటులో ఉందని ఒక ప్రకటనలో తెలిపింది. డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ను కమిషన్ నవంబర్ 25న ప్రకటించింది. మొత్తం 3 విడతల్లో ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించగా… ఇవాళ్టి నుంచి మొదటి విడత నామినేషన్లను స్వీకరిస్తున్నారు.