...
...
Next Story

తెలంగాణలో పెరగనున్న ఉష్ణోగ్రతలు.. అవసరమైతే స్కూళ్లు క్లోజ్.. వాటర్ బ్రేక్స్

Telangana Weather Update : తెలంగాణలో వాతావరణ పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. బయట అడుగుపెట్టాలంటే వడగాలులు, ఉష్ణోగ్రతల పెరుగుదలతో జనాలు భయపడుతున్నారు. మరో ఆరు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరగనున్నాయి.

Published on: Apr 17, 2026, 15:41:23 IST
Advertisement

తెలంగాణలో తీవ్రమైన వడగాలుల పరిస్థితులు నెలకొన్నాయి. ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరగడంతో పలు జిల్లాల్లో జనాలు ప్రభావితం అవుతున్నారు. రాబోయే ఆరు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరించారు. బుధ, గురువారాల్లో పలు జిల్లాల్లో తీవ్రమైన వడగాలుల పరిస్థితులు నమోదవడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై తక్షణ సహాయక చర్యల కోసం ఆదేశాలు జారీ చేసింది.

తెలంగాణలో పెరగనున్న ఉష్ణోగ్రతలు
తెలంగాణలో పెరగనున్న ఉష్ణోగ్రతలు

విపత్తు నిర్వహణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం. దాన కిషోర్.. జిల్లా కలెక్టర్లను నోడల్ అధికారులుగా నియమిస్తూ.. వైద్య, రెవెన్యూ, పురపాలక, అగ్నిమాపక, కార్మిక శాఖలతో సహా అన్ని విభాగాలను వేడి నివారణ చర్యలను అమలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. గత ఐదు రోజులుగా ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ, నిజామాబాద్ జిల్లాల్లో వడగాలుల సంబంధిత అనారోగ్యాల కారణంగా 10 మందికి పైగా మరణించినట్లు అధికారులు తెలిపారు.

అధిక ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతాలను గుర్తించి, బస్ స్టేషన్లు, రద్దీగా ఉండే ప్రదేశాలలో కూలింగ్ సెంటర్లు, నీడ కోసం ఏర్పాట్లు, తాగునీటి సౌకర్యాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ఐస్ ప్యాక్‌లను పంపిణీ చేయాలని కూడా చెప్పారు. ప్రభావిత ప్రాంతాల్లోని పాఠశాలలు అవసరమైతే పనివేళలను తగ్గించవచ్చు, తరగతులను నిలిపివేయవచ్చు, అయితే విద్యార్థులకు వాటర్ బ్రేక్స్ తప్పనిసరిగా అందించాలి. ప్రజలు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3:30 గంటల వరకు బయట తిరగకుండా ఉండాలని, తగినంత నీరు తాగాలని, మాస్కులు, కళ్లద్దాలు ధరించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

రాష్ట్రవ్యాప్తంగా తీవ్రమైన వేడి పరిస్థితులు కొనసాగుతున్నందున, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

మరోవైపు ఆకస్మిక ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. జగిత్యాల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మెదక్ తదితర జిల్లాల్లో ఏప్రిల్ 19, 20 తేదీల మధ్య తేలికపాటి నుంచి మోస్తరు వర్షం, వడగళ్లు పడే అవకాశం ఉంది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe