...
...
Next Story

TG Inter Admissions 2026 : ఇంటర్ అడ్మిషన్ల గడువు పెంపు.. కాలేజీలు పాటించాల్సిన నిబంధనలు

TG Inter Admissions 2026 : తెలంగాణ ఇంటర్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ల గడువు పెంచింది ఇంటర్ బోర్డు. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. దీంతో విద్యా్ర్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది.

Published on: Aug 15, 2026, 09:41:32 IST
Advertisement

తెలంగాణ రాష్ట్రంలో 2026-27 విద్యాసంవత్సరానికి గాను జూనియర్ కళాశాలల్లో చేరాలనుకునే విద్యార్థులకు తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలి శుభవార్త తెలిపింది. మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ ప్రవేశాలకు సంబంధించి తుది గడువును పెంచుతున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

తెలంగాణ ఇంటర్ అడ్మిషన్స్ గడువు పొడిగింపు
తెలంగాణ ఇంటర్ అడ్మిషన్స్ గడువు పొడిగింపు

వివిధ కారణాల వల్ల ఇప్పటి వరకు అడ్మిషన్లు తీసుకోలేకపోయిన పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని, వారికి మరొక విలువైన అవకాశం కల్పిస్తూ ఆగస్టు 31, 2026 వరకు ప్రవేశాల గడువును విస్తరించింది. బోర్డు జారీ చేసిన ఈ నూతన ఆదేశాలు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని కేటగిరీల జూనియర్ కళాశాలలకు వర్తిస్తాయి.

ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ & ఎయిడెడ్ కళాశాలలు, సాంఘిక, గిరిజన, మైనారిటీ సంక్షేమ రెసిడెన్షియల్ కళాశాలలు, తెలంగాణ మోడల్ స్కూల్స్, కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలకు ఈ పెంచిన గడువు వర్తిస్తుంది.

గడువు సమీపించే వరకు వేచి చూడకుండా విద్యార్థులు వీలైనంత త్వరగా తమకు నచ్చిన కళాశాలల్లో సీటును ఖరారు చేసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. ఇంటర్మీడియట్ ప్రవేశాల నిర్వహణలో కళాశాల యజమాన్యాలు కచ్చితంగా పాటించాల్సిన కొన్ని కీలక మార్గదర్శకాలను టీజీబీఐఈ విడుదల చేసింది.

ఇంటర్ అడ్మిషన్ల కోసం ఎలాంటి ప్రత్యేక ప్రవేశ పరీక్షలు నిర్వహించకూడదని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. పదో తరగతిలో సాధించిన మార్కులు లేదా జీపీఏ మెరిట్ ఆధారంగానే సీట్లు కేటాయించాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వర్గాల వారీగా రిజర్వేషన్ పద్ధతిని పక్కాగా అమలు చేయాలి.

అడ్మిషన్ పొందే సమయంలో ప్రతి విద్యార్థి ఆధార్ కార్డు సమర్పించడంతో పాటు, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటామని తెలిపే యాంటీ డ్రగ్ డిక్లరేషన్ పత్రంపై సంతకం చేయడం తప్పనిసరి. ప్రైవేట్ కళాశాలల్లో తరగతి గదుల రద్దీని నివారించేందుకు ఒక సెక్షన్‌కు గరిష్ఠంగా 88 మంది విద్యార్థులను మాత్రమే చేర్చుకోవడానికి అనుమతి ఉంటుంది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe